ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని కూటమి నేతలు మండిపడుతున్నారు.ప్రభుత్వ పథకాల అమలులో ఆయన పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని, అకౌంటబులిటీని అమలు చేస్తున్నారని గుర్తుచేస్తున్నారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబాబు పిలుపునివ్వడం వెనుక తప్పుడు అర్థాలు ఎందుకు తీస్తున్నారని ఫైర్ అవుతున్నారు.2024 జనరల్ ఎలక్షన్స్ తర్వాత చంద్రబాబు జనాభా పెంచడం మీద ఫోకస్ పెట్టారు. దంపతులు కనీసం ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. ఇలా చేయడం వలన మున్ముందు దేశంలో వృద్ధుల సంఖ్యకు తోడుగా యువతరం సైతం సమానంగా ఉంటుందని గుర్తుచేశారు. దేశ, రాష్ట్రాభివృద్ధిలో యువతరం కీ రోల్ పోషిస్తుందని స్పష్టంచేశారు.
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని కొత్త బురుజు గ్రామంలో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాాల పంపిణీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. డబ్బు మీద ఆశతో ఒక్కరి కంటే ఎక్కువ మందిని కనడం లేదన్నారు. ఇప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మందిని కనాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. పెద్దకుటుంబానికి ఎక్కువ సహాయం చేసేలా ప్రభుత్వ పథకాలు రూపొందిస్తామని చంద్రబాబు అన్నారు.గత పాలనకు తమ పాలనకు తేడా చాలా ఉందని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని సీఎం పేర్కొన్నారు. వైసీపీ హయాంలో చేసిన తప్పులను కూటమి సర్కార్ సరిచేస్తున్నదని, రైతులకు సంబంధించి పాస్ పుస్తకాలు తారుమారు కాకుండా ప్రభుత్వం చూస్తున్నదని అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడులు రాలేదని, అప్పుల మీద అప్పులు చేసి రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారని అన్నారు. అప్పులు తీర్చేందుకు కూటమి సర్కార్ తీవ్రంగా శ్రమిస్తున్నదని సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. తిరుమల వేంకటేశ్వర స్వామి విషయంలో గత వైసీపీ సర్కార్ తప్పుచేసిందని ఫైర్ అయ్యారు. అందుకే ప్రస్తుతం వైసీపీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉందన్నారు.ఇదిలాఉండగా, చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు గరం అవుతున్నారు.తమ ప్రభుత్వ హయాంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారని గుర్తుచేస్తున్నారు.కల్తీ నెయ్యి అంశాన్ని కూటమి సర్కార్ కావాలనే రాజకీయం చేస్తున్నదని వారు విమర్శలు చేస్తున్నారు.
దీనికి తోడు ఇద్దరు కంటే ఎక్కువగా మంది పిల్లలను కనాలని చంద్రబాబు పిలుపునివ్వడాన్ని వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు.హిందూ ఓట్లు పెరిగితే తమకు కలిసి వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో కలిసి వస్తుందనే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారని, అంతకుమించి ఆయనకు అభివృద్ధి మీద పెద్దగా ఆసక్తి లేదని, చంద్రబాబుకు కేవలం రాజకీయాలే ముఖ్యమని విమర్శలు చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి సర్కార్ ప్రజలను వంచిస్తోందని, ఎన్నికల కోసమే చంద్రబాబు చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు మొదలెట్టారు. ప్రతిపక్ష నేతల ఆరోపణలు, విమర్శలకు కూటమి నేతలు సైతం గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నట్టు సమాచారం.