Health Issues: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అందరికీ సవాలుతో కూడుకున్న పనే. ముఖ్యంగా ఆఫీసులకి వెళ్లే ఉద్యోగస్తులు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు గంటల తరబడి ల్యాప్టాప్లకు అతుక్కు పోవాల్సి ఉంటుంది. ఇలా చాలామంది పనిలో పడి తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, విశ్రాంతి లేకుండా నైట్ షిఫ్ట్స్ చేయడం, తగినంత నీరు తాగకపోవడం వంటి చిన్న తప్పులే వాళ్ల శరీరంపై పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ అలవాట్లను ఇలానే కొనసాగిస్తే.. అనారోగ్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాళ్లు తమ రోజూవారి దినచర్యలో చేసే పొరపాట్లు ఏమిటంటే..
ఆలస్యంగా నిద్రలేవడం వల్లనో.. చిన్న చిన్న కారణాల వల్లనో చాలామంది చేసే కామన్ మిస్టేక్ బ్రేక్ఫాస్ట్ను స్కిప్ చేయడం. ఈ పొరపాటు మీ శరీర జీవక్రియను దెబ్బ తీయడంతో పాటు, మీ శక్తి స్థాయిలను కూడా తగ్గిస్తుంది. ఈ అలవాటు దీర్ఘకాలం కొనసాగితే మాత్రం.. ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమామం పెరుగుతుంది. ప్రతిరోజూ పోషకాహారంతో కూడిన అల్పాహారం తీసుకోవాలి.
పనిలో పడి గంటల తరబడి కూర్చున్న కుర్చీకే అతుక్కుపోవడం అన్నిటి కంటే పెద్ద పొరపాటు. దీనివల్ల వెన్నునొప్పి ఊబకాయం, రక్తప్రసరణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనీసం గంటకోసారైనా లేచి 5 నిమిషాల పాటు నడవటం లేదా స్ట్రెచ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ అలవాటు మీ శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
ల్యాప్టాప్ ముందు వాలిపోవడం లేదా నిటారుగా కూర్చోకపోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి, మెడనొప్పి, ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం పడుతుంది. కాబట్టి.. కుర్చీలో వెన్నెముకను నిటారుగా ఉంచి, మానిటర్ను కళ్లకు సమానంగా పెట్టుకోవడం ఉత్తమం.
గంటల తరబడి మొబైల్లో మునిగిపోవడం వల్ల బ్లూ లైట్ కళ్లకు హానికరం మాత్రమే కాదు.. మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఫలితంగా నిద్ర సరిగా లేకపోవడం, మానసిక అలసట, దృష్టి లోపం వంటి సమస్యలొస్తాయి. రాత్రి పడుకునే ముందు కనీసం 30 నిమిషాల పాటు ఫోన్కు దూరంగా ఉండాలి.
రోజంతో పనిలో పడి శరీరానికి తగినంత నీళ్లు అందివ్వకపోవడం చాలామందిలో ఉండే అలవాటు. ఇది డీహైడ్రేషన్, కిడ్నీ సమస్యలు, చర్మం పొడిబారడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. ప్రతిరోజూ 7 నుంచి 8 గ్లాసుల మంచి నీరు తాగడం తప్పనిసరి అని వైద్య నిపుణులు చెబుతున్నారు.