Hepatitis Jaundice: హెపటైటిస్ అంటే కాలేయంలో (లివర్) వాపు రావడం. వైరల్ ఇన్ఫెక్షన్లు, అధిక మద్యం సేవించడం, కొన్ని మందులు, విషపదార్థాలు లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధుల వల్ల ఇది రావచ్చు. చాలా మంది సరైన చికిత్స, విశ్రాంతితో పూర్తిగా కోలుకుంటారు. అయితే కొందరిలో ఈ వ్యాధి చాలా వేగంగా తీవ్రమవుతుంది. దీని వల్ల కామెర్లు (జాండిస్) వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే హెపటైటిస్లో కనిపించే ప్రమాదకర లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం.
కాలేయం.. శరీరంలోని విషపదార్థాలను తొలగించడం, పోషకాలను నిల్వ చేయడం, జీర్ణక్రియకు సహాయపడడం వంటి ముఖ్యమైన పనులు చేస్తుంది. కాలేయంలో వాపు వచ్చినప్పుడు దాని పనితీరు తగ్గిపోతుంది. ప్రారంభ దశలో చికిత్స తీసుకుంటే చాలా మంది కోలుకునే అవకాశం ఉంటుంది.
చాలామంది హెపటైటిస్ లక్షణాలను సాధారణ వైరల్ ఫీవర్ అని భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ చికిత్స ఆలస్యం అయితే కాలేయం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. సరైన సమయంలో వైద్యులను సంప్రదిస్తే తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు.
కళ్లలో లేదా చర్మంలో పసుపు రంగు కనిపించడం సాధారణ లక్షణం. కానీ ఒక్కటి లేదా రెండు రోజుల్లోనే ఆ రంగు మరింత ముదురితే జాగ్రత్త అవసరం. దీంతో పాటు మూత్రం ముదురు రంగులోకి మారడం, మలం తెల్లగా కనిపించడం కూడా కాలేయం పనితీరు తగ్గిన సంకేతాలు.
కాలేయం విషపదార్థాలను తొలగించలేకపోతే అవి మెదడుపై ప్రభావం చూపుతాయి. మాటలు స్పష్టంగా రాకపోవడం, ఎక్కువ నిద్ర రావడం, చేతులు వణకడం లేదా ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
వాంతుల సమయంలో రక్తం రావడం లేదా నల్లటి, తారు లాంటి మలం రావడం అంతర్గత రక్తస్రావానికి సంకేతం కావచ్చు. ఇది ఎమర్జెన్సీ పరిస్థితి కాబట్టి ఆలస్యం చేయకూడదు.
చిగుళ్ల నుంచి రక్తం రావడం, ముక్కు నుంచి రక్తం ఆగకపోవడం లేదా చిన్న దెబ్బకే పెద్ద గాయాలు కావడం.. ఇవన్నీ రక్తం గడ్డకట్టే ప్రోటీన్లను కాలేయం సరిగా తయారు చేయలేకపోతోందని సంకేతం.
కడుపు బాగా ఉబ్బిపోవడం, తీవ్రమైన నొప్పి రావడం లేదా పొత్తికడుపులో ద్రవం చేరడం వంటి లక్షణాలు తీవ్రమైన సమస్యలకు సంకేతాలు కావచ్చు. వెంటనే వైద్యులను సంప్రదించాలి.
అధిక జ్వరం, వణుకు రావడం శరీరంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు సూచిస్తుంది. కాలేయ సమస్యలతో బాధపడేవారిలో ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది.
సాధారణం కంటే చాలా తక్కువ మూత్రం రావడం మూత్రపిండాలపై కూడా ప్రభావం పడుతున్న సంకేతం కావచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
తరచుగా వాంతులు రావడం వల్ల శరీరంలో నీరు తగ్గిపోతుంది. ఇది కాలేయంపై మరింత ఒత్తిడి పెంచుతుంది. వెంటనే వైద్య చికిత్స అవసరం.
సాధారణ అలసటకు భిన్నంగా రోజువారీ పనులు కూడా చేయలేని స్థాయిలో బలహీనంగా అనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది.
గర్భిణీలు, ముఖ్యంగా హెపటైటిస్ ఈ ఉన్నవారు, వృద్ధులు, ఇప్పటికే కాలేయ వ్యాధులు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, మధుమేహం లేదా ఫ్యాటీ లివర్ ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి.
Also Read: డబ్బు, అందం కాదు.. మహిళలు తమ భర్తలో ఈ 3 గుణాలు ఉండాలని కోరుకుంటారు
పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లాలి. వైద్యుల సలహా లేకుండా నొప్పి నివారణ మందులు వాడకూడదు. వాంతులు లేకపోతే తగినంత నీరు తాగాలి. మీరు తీసుకుంటున్న అన్ని మందులు, సప్లిమెంట్లు లేదా ఆయుర్వేద ఔషధాల గురించి డాక్టర్కు తప్పకుండా చెప్పాలి. రక్త పరీక్షల ద్వారా కాలేయం పనితీరును త్వరగా అంచనా వేయవచ్చు.
హెపటైటిస్ ఉన్న ప్రతి ఒక్కరికీ తీవ్రమైన సమస్యలు రావాల్సిన అవసరం లేదు. అయితే కొందరిలో పరిస్థితి చాలా వేగంగా క్షీణిస్తుంది. కామెర్లు పెరగడం, గందరగోళం, రక్తస్రావం లేదా ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వైద్య సహాయం పొందాలి. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే కాలేయాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రాణాపాయ పరిస్థితులను కూడా నివారించవచ్చు.