ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒక్క క్షణం ఆలోచిస్తే.. అలాంటి ఆలోచనలే రావు. ఒకవేళ వచ్చినా తమ సన్నిహితులతో మాట్లాడాలి. లేదా మనస్సును వేరే విషయాల మీదకు మళ్లించాలి. మీ స్నేహితులు లేదా ఆప్తుల్లో అలాంటి లక్షణాలు కనిపిస్తే.. వారికి ధైర్యం చెప్పండి. వారి ప్రాణం నిలబెట్టింది. మనుషులకు అది మన ధర్మం. ఇలాంటి విషయాల్లో జపాన్ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఆత్మహత్యలను ఆపేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తుంది. అక్కడి ప్రభుత్వాలే కాదు.. ప్రజలు కూడా దాన్ని బాధ్యతగా భావిస్తారు. ఇందులో భాగంగా జపాన్ అధికారులకు వచ్చిన ఓ వినూతన ఆలోచన.. ఎన్నో ప్రాణాలను కాపాడుతోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.
జపాన్ ప్రభుత్వం గత కొన్నాళ్లుగా ఆత్మహత్యల నిర్మూలన కోసం జనాలకు కౌన్సిలింగ్ ఇప్పించడమే కాకుండా.. పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జీవితం చాలా విలువైనదని, క్షణికావేశంతో ప్రాణాలు తీసుకోవద్దని ప్రచారం చేస్తోంది. అయినా సరే.. ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టకపోవడంతో పలు పబ్లిక్ ప్లేసెస్లో నీలం రంగు ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్న ఈ లైట్లు ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నాయి. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన నుంచి బయటపడేస్తున్నాయి. ఇప్పటివరకు జపాన్ 72 రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లలో ఈ బ్లూ ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసిందట. వీటిని పెట్టిన తర్వాత ఆత్మహత్యల సంఖ్య 84 శాతానికి తగ్గిపోయినట్లు గణంకాలు చెబుతున్నాయి.
జపాన్లో జీవించడం అంటే అంత ఈజీ కాదు. అక్కడ పని ఒత్తిడి చాలా ఉంటుంది. అక్కడి మనుషులు నిత్యం పనుల్లో తలమునకలై ఉంటారు. వర్క్.. లైఫ్ బ్యాలెన్స్ చాలా కష్టం. ఇప్పుడిప్పుడే అక్కడి పని విధానాలు, ఆలోచనలు మారుతున్నాయి. కానీ, పాతికేళ్ల కిందట మనుషులా, యంత్రాలా? అనేలా జపనీయులు పనిచేసేవారు. దీంతో చాలామంది ఒత్తిడిలో ఆత్మహత్యలు చేసుకొనేవారు. దాన్ని నివారించడం కోసం జపాన్ ప్రభుత్వం 2000 సంవత్సరంలో రైల్వే స్టేషన్తో పాటు పలు పబ్లిక్ ప్లేసెస్లో నీలం రంగు ఎల్ఈడీ లైట్లు పెట్టడం ప్రారంభించింది. ముఖ్యంగా టోక్యోలోని మెట్రో స్టేషన్లను నీలం రంగు ఎల్ఈడీ లైట్లతో నింపేసింది. ఆ తర్వాత అక్కడ ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా తగ్గింది.
జపాన్లో ప్రజలు ఎక్కువ శాతం పబ్లిక్ ట్రాన్స్పోర్టునే వాడతారు. ముఖ్యంగా మెట్రో రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే, డిప్రెషన్లో ఉన్న చాలామంది.. రైళ్లు వచ్చేప్పుడు ప్లాట్పామ్ల మీదకు దూకి ఆత్మహత్యలకు పాల్పడేవారు. అందుకే బ్లూ ఎల్ఈడీ లైట్ల ప్రయోగం చేశారు. నీలం రంగుకు చాలా ప్రత్యేకత ఉంది. అది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఉద్వేగభరితమైన క్షణాలకు అంతరాయం కలిగిస్తుంది. నీలి రంగు కాంతి.. నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. ఆందోళన తగ్గించి.. తీవ్రమైన ఆలోచనలు తీసుకొనే ముప్పు నుంచి గట్టెక్కిస్తుంది. ఈ నీలి రంగు లైట్లు ఏర్పాటు చేసిన తర్వాత ఆత్యహత్యలు ఘననీయంగా తగ్గడంతో ఇతర నగరాలకు కూడా విస్తరిస్తున్నారు. ఇలాంటి ఆలోచన మన అధికారులకు కూడా వస్తే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు కదూ.
Also Read: ఈ పక్షి ఉమ్ము ఖరీదు రూ.10 లక్షలకు పైనే.. లొట్టలేసుకుని మరీ తింటున్నారు!