Importance Of Vitamins: మనం రోజువారీ పనుల్లో బిజీగా ఉండి మన శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను పట్టించుకోం. కానీ.. తరచూ అలసటగా అనిపించినా, కళ్ళు సరిగ్గా కనిపించకపోయినా, లేదా ఒళ్ళు నొప్పులు వస్తున్నా అది విటమిన్ల లోపం కావచ్చు. మన యంత్రం లాంటి శరీరానికి విటమిన్లు అనేవి ఇంధనం లాంటివి. ఇవి తక్కువైతే ఆరోగ్యం దెబ్బతింటుంది. మరి ఏ విటమిన్ తగ్గితే ఏమవుతుందో ? అసలు మనకు ఏది ఎక్కువ అవసరమో ఇప్పుడు సింపుల్గా తెలుసుకుందాం.
విటమిన్ ఎ: కంటి చూపుకు ఆధారం:
విటమిన్ ఎ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా కంటి చూపును మెరుగు పరుస్తుంది.
లోపిస్తే ఏమవుతుంది?: దీని లోపం వల్ల ప్రధానంగా ‘రేచీకటి’ వస్తుంది. అంటే వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు ఏదీ సరిగ్గా కనిపించదు.
లక్షణాలు: కళ్ళు పొడిబారడం, చర్మం గరుకుగా మారడం, తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడటం.
లభించే ఆహారం: క్యారెట్లు, బొప్పాయి, ఆకుకూరలు, గుడ్లు.
విటమిన్ బి: శక్తికి మూలం:
విటమిన్ బి అనేది ఎనిమిది విటమిన్ల సమూహం. ఇది మన మెదడు పనితీరుకు, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి చాలా అవసరం.
లోపిస్తే ఏమవుతుంది?: దీని వల్ల ‘బెరిబెరి’ వ్యాధి రావచ్చు. అలాగే రక్తహీనత ఏర్పడుతుంది. మెదడుపై ప్రభావం చూపి జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
లక్షణాలు: నోటి పూత, పెదవుల పగుళ్లు, విపరీతమైన నీరసం, కాళ్లు చేతులు తిమ్మిర్లు రావడం.
లభించే ఆహారం: మిల్లెట్స్, పాలు, మాంసం, గింజలు
విటమిన్ సి: రోగనిరోధక రక్షణ:
శరీరంలో గాయాలు త్వరగా మానాలన్నా.. ఇన్ఫెక్షన్లతో పోరాడాలన్నా విటమిన్ సి ఉండాల్సిందే. ఇది ఒక శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్.
లోపిస్తే ఏమవుతుంది?: విటమిన్ సి లోపం వల్ల ‘స్కర్వీ’ వ్యాధి వస్తుంది. ఇది చిగుళ్ల నుంచి రక్తం కారడం, చర్మంపై నల్లని మచ్చలకు దారి తీస్తుంది.
లక్షణాలు: చిగుళ్లు వాయడం, పళ్లు వదులు కావడం, చర్మంపై దద్దుర్లు, గాయాలు తగ్గడానికి ఎక్కువ సమయం పట్టడం.
లభించే ఆహారం: ఉసిరి, నిమ్మ, నారింజ, జామ వంటి పుల్లటి పండ్లు.
Also Read: ఫ్రిజ్ అవసరమే లేదు.. ఈ ప్రాచీన పద్ధతితో ఆరోగ్యం, చల్లని నీరు మీ సొంతం!
విటమిన్ డి: ఎముకల బలం:
దీనిని ‘సన్షైన్ విటమిన్’ అని కూడా పిలుస్తారు. క్యాల్షియం గ్రహించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
లోపిస్తే ఏమవుతుంది?: పిల్లల్లో ‘రికెట్స్’ (వంకర కాళ్లు), పెద్దల్లో ‘ఆస్టియో మలేషియా’ (ఎముకలు మెత్తబడటం) వంటి సమస్యలు వస్తాయి.
లక్షణాలు: తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, ఎముకల బలహీనత, వెన్నునొప్పి, తరచూ మూడ్ స్వింగ్స్ (డిప్రెషన్ లాంటి స్థితి).
లభించే మార్గం: ఉదయాన్నే సూర్యరశ్మి తగలడం, చేపలు, గుడ్డులోని పచ్చసొన.
విటమిన్లు అనేవి మన శరీరానికి సూక్ష్మ మోతాదులో అవసరమైనప్పటికీ.. వీటి ప్రాముఖ్యత మాత్రం చాలా ఎక్కువ. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో జంక్ ఫుడ్ పక్కన పెట్టి, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఈ లోపాలను సరిదిద్దుకోవచ్చు. మీ శరీరంలో పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం బెస్ట్.