Multivitamin Side Effects: నిద్ర లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకూ మనిషి ఓ యంత్రంలా మారిపోతుంటాడు. ఈ క్రమంలో ఒంట్లో ఏ కాస్త నీరసంగా అనిపించినా, అలసటగా ఉన్నా వెంటనే మల్టీ విటమిన్ ట్యాబ్లెటన్లను మింగేస్తున్నారు. ఇప్పటికీ ఈ అలవాటును చాలామంది తమ రోజువారీ జీవనశైలిలో భాగం చేసుకుంటున్నారు. అయితే ఇలా ప్రతిదానికీ మల్టీ విటమిన్లు వాడటం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ మాత్రలు అప్పటికప్పుడు శక్తిని ఇచ్చినప్పటికీ.. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వలన చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందని చెబుతున్నారు. అవసరం లేకున్నా మోతాదుకు మించి విటమిన్ మాత్రలు మింగటం వలన లాభాల కంటే.. నష్టాలే ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన శరీరానికి ఏం కావాలో తెలుసుకోకుండా, కేవలం అలసటను తగ్గించుకోవడానికి ఔషధాలపై ఆధారపడటం ప్రమాదకరమని చెబతున్నారు.
Also Read: రోజూ 2 వెల్లుల్లి రెబ్బలు తింటే ఏమవుతుంది? ఈ లాభాలు తెలిస్తే వద్దన్నా తినేస్తారు!
ఒంట్లో కాస్త అలసటగా అనిపించినా.. దానిని ఓ జబ్బుగా భావిస్తారు చాలామంది. కానీ నిజానికి అలసట అనేది మన శరీరంలో ఏదో లోపం ఉందని, విశ్రాంతి తీసుకోమని మన శరీరం మనకిచ్చే సూచన. సరైన నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ చేయకపోవడం, శరీరానికి సరిపడా మంచి నీరు అందకపోవడం వల్ల శరీరం నీరసించి పోవడం సర్వ సాధారణం. ఇలాంటి సమయంలో అసలు కారణమేంటో గ్రహించకుండా.. మల్టీ విటమిన్ మాత్రలు వాడటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే.. హెల్తీగా ఉన్న వ్యక్తికి ఆహారం ద్వారానే విటమిన్లు అందుతాయి. అదనంగా మందులు వాడితే కిడ్నీలు, కాలేయం దెబ్బతింటుంది.
మన శరీరంలో A, D, E, K వంటి విటమిన్లు అధికమైతే అవి విషతుల్యంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ విటమిన్ల లోపం ఉందని డాక్టర్లు రక్త పరీక్షల ద్వారా నిర్ధారిస్తేనే ట్యాబ్లెట్స్ వాడాలి. అంతేగానీ.. సొంత వైద్యంతో విటమిన్ మాత్రలు వేసుకుంటే వాంతులు, తలనొప్పి, కడుపులో మంట వంటి సమస్యలు రావొచ్చు. ముఖ్యంగా నేటి ఆధునిక జీవనశైలిలో చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతిరోజూ 7 – 8 గంటలు నిద్ర పోవడం మన శరీరానికి ఎంతో అవసరం. నిద్ర సరిగ్గా ఉంటే.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.
సాధారణంగా పరీక్షల సమయంలో విద్యార్థులు నిద్రను త్యాగం చేసి మరీ చదువుతుంటారు. తరచూ ఇలా చేయడం వలన బ్రెయిన్ ఫాగ్ ఏర్పడి ఆ చదివింది కూడా గుర్తుండదు. అందుకే శరీరంలోని నీరసం తగ్గాలంటే.. విటమిన్ మాత్రల కంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. దీని కోసం పడక గదిలో మంచం మీద కూర్చుని చదవకూడదు. అలాగే ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం చేయాలి. నిద్రపోయే గంట ముందు ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలి. ఇలా చేయడం వలన ఎలాంటి అలసట దరిచేరదు.
Also Read: సాధారణ కూరగాయే కానీ అసాధారణ లాభాలు.. డైట్లో చేర్చుకుంటే వందమంది బలం మీ సొంతం!