విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానం విజయవంతంగా టేకాఫ్ అయింది. గడువులోపే నిర్మాణం పూర్తి చేశామని, అత్యాధునిక సాంకేతికతో దీనిని రూపొందించామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
నీటి దోపిడీపై బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నా.. ఏపీ వాడుకుంటే అభ్యంతరం చెప్పడం సిగ్గుచేటన్నారు. గతంలో సముద్రపు నీటిని వినియోగించుకోవాలని కేసీఆర్ చెప్పిన మాటలను హరీశ్ రావు మర్చిపోయారా అని ఆయన ప్రశ్నించారు.
నదీ జలాల పంపిణీలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత బీఆర్ఎస్ పాలన సాగునీటి స్వర్ణయుగమని, ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం ప్రాజెక్టులపై కక్ష కట్టిందని ఆరోపించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్ ముందు ఉద్రిక్తత నెలకొంది. గజ్వేల్ ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలంటూ కాంగ్రెస్ పార్టీ నేత ఆంక్ష రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఫామ్హౌస్ను ముట్టడించడానికి ప్రయత్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లకపోతే.. వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయడంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. హరీశ్ రావును ‘గుంటనక్క’ అని సంబోధిస్తూ.. అసెంబ్లీలో మాట్లాడకుండా బయట పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం ప్రజలను మభ్యపెట్టడమేనని విమర్శించారు. తెలంగాణ నీటి వాటా తగ్గించే ఒప్పందాలపై గతంలో సంతకాలు చేసింది మీరు కాదా అని ఆమె నిలదీశారు.
నదీ జలాలపై తాను ఇచ్చిన ప్రజెంటేషన్ కేవలం రాజకీయాల కోసం కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని హరీశ్ రావు స్పష్టం చేశారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. అసెంబ్లీలో చర్చించకుండా బయట ప్రజెంటేషన్లు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు. చట్టసభల్లో గళం విప్పాల్సింది పోయి బయట సెషన్లు పెట్టడమేంటని ఆమె ప్రశ్నించారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా మేడమ్ పెల్లి వద్ద రబీ పంటల సాగు కోసం సదర్మాట్ కాలువ ద్వారా ఆయన నీటిని విడుదల చేశారు. వారబందీ పద్ధతిని అనుసరించాలని, రైతులు సాగునీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలం నరసాపురం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన లారీ బైక్ను ఢీకొనడంతో, ఇద్దరు వ్యక్తులు లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు మోత్కూర్, ముశిపట్ల వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో బిగ్ టీవీ, బీకేఆర్ ఫౌండేషన్, సిఎంఆర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో 603వ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. పేద, మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో అనేకమందికి బిపి, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. నిజాంపేట వర్టెక్స్ ప్రైమ్ అపార్ట్మెంట్లోని స్విమ్మింగ్ పూల్లో ప్రమాదవశాత్తు జారిపడి అర్జున్ కుమార్ అనే మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అపార్ట్మెంట్ వాసుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ జిల్లా బందనపల్లిలో కోతుల బెడదను తప్పించేందుకు సర్పంచ్ వినూత్నంగా కొండెంగలను గ్రామంలోకి రప్పించారు. కొండెంగల భయంతో కోతులు గ్రామాన్ని విడిచి పారిపోయాయి. గ్రామస్తులు కొండెంగలకు ఆహారం అలవాటు చేసి అక్కడే ఉండేలా చూడటంతో తమకు కోతుల నుంచి విముక్తి లభించిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ జమానాపై ఎమ్మెల్యే జయసూర్య నిప్పులు చెరిగారు. ఐదేళ్లల్లో విధ్యంసం సృష్టంచారని మండిపడ్డారు. కరెంట్ చార్జీలు తగ్గిస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలోనే స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధ్యమన్నారు.
మచిలీపట్నంలో సామాన్యులపై దాడికి తెగబడిన రౌడీ మూకలకు పోలీసులు వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. మద్యం మత్తులో హంగామా సృష్టించిన ముగ్గురు యువకులను ఎస్పీ ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్న సీఐ యేసుబాబు, వారిని నడిరోడ్డుపై నడిపిస్తూ స్టేషన్కు తరలించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్ ఏపీ అభివృద్ధిలో మైలురాయి అని మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. విజన్ వైజాగ్ లక్ష్యానికి ఇది కీలకమని పేర్కొంటూ జీఎంఆర్ గ్రూపును అభినందించారు. పోర్టును, ఎయిర్పోర్టును అనుసంధానించే జాతీయ రహదారి ప్రాజెక్టుకు సహకరించిన నితిన్ గడ్కరీకి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తిరుపతి జిల్లా తడ కండ్రిగ కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని వెంకట లక్ష్మి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్ర గాయాలైన ఆమెను చికిత్స నిమిత్తం తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని బయటకు రాకుండా సిబ్బంది దాస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
వెనెజుయెలాలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఆ దేశానికి వెళ్లవద్దని, అక్కడ ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉంటూ రాయబార కార్యాలయంతో సంప్రదింపుల్లో ఉండాలని సూచించింది. అమెరికా చర్యల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
వెనెజుజులా అధ్యక్షుడు, ఆయన భార్యను అమెరికా బందీలుగా తీసుకెళ్లడంపై పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఇది అంతర్జాతీయ సూత్రాల ఉల్లంఘనని, ఒక దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడమేనని మండిపడ్డారు. అమెరికా చర్యను నేరపూరిత మిలిటరీ దురాక్రమణగా వెనిజులా అభివర్ణిస్తూ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది.
ఎలాన్ మస్క్కు చెందిన ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ కీలక ప్రకటన చేసింది. చట్టవిరుద్ధమైన, అశ్లీల కంటెంట్ను అప్లోడ్ చేసే ఖాతాలను శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని ‘ఎక్స్’ ప్రకటించింది. ముఖ్యంగా ఏఐ ద్వారా సృష్టించిన అసభ్యకర చిత్రాలపై భారత ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, స్థానిక ప్రభుత్వాలకు సహకరిస్తామని సంస్థ స్పష్టం చేసింది.
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు మహ్మద్ షమిని ఎంపిక చేయకపోవడంపై ఇర్ఫాన్ పఠాన్ అసహనం వ్యక్తం చేశారు. దేశవాళీలో 200 ఓవర్లు వేసి ఫిట్నెస్ నిరూపించుకున్నా షమికి చోటు దక్కకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఐపీఎల్లో రాణిస్తే షమి పునరాగమనాన్ని ఎవరూ అడ్డుకోలేరని పఠాన్ అభిప్రాయపడ్డారు.
ప్రభాస్-మారుతి కాంబోలో వస్తున్న ది రాజాసాబ్ సంక్రాంతి కానుకగా ఈనెల 9న విడుదల కానుంది. చిత్ర ప్రచారంలో భాగంగా నచ్చే నచ్చే అనే రీమిక్స్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. తమన్ సంగీతం అందించిన ఈ ఫుల్ సాంగ్ను రేపు విడుదల చేయనున్నారు. వింటేజ్ ప్రభాస్ను గుర్తుచేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.