High Blood Pressure : ఈ రోజుల్లో ఆరోగ్య స్పృహ పెరిగి చాలా మంది హోటల్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ జంక్ ఫుడ్స్కు దూరంగా ఉంటున్నారు. రోజు వారీగా కేవలం ఇంట్లో వండిన తాజా ఆహారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే.. ఇక్కడే ఒక విచిత్రమైన సమస్య వెలుగు చూస్తోంది. కేవలం హోమ్ ఫుడ్ తినే వారిలో కూడా రక్తపోటు లేదా హైపర్టెన్షన్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. బయట తిండి తినకపోయినా బీపీ ఎందుకు పెరుగుతోంది? మన వంటింట్లో మనం గమనించని ఆ ‘సైలెంట్ కిల్లర్స్’ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం.
ఇంటి భోజనం తినే వారిలో హై బీపీకి కారణాలు:
సాధారణంగా ఉప్పు, నూనె ఎక్కువగా ఉండే ఫాస్ట్ ఫుడ్స్ తింటేనే బీపీ వస్తుందని మనం అనుకుంటాం. కానీ.. ఆరోగ్యకరమైన ఇంటి వంటలు తింటూ కూడా బీపీ బారిన పడుతున్నారంటే దానికి ప్రధాన కారణం మన లైఫ్ స్టైల్, వంట చేసే పద్ధతుల్లో ఉన్న కొన్ని లోపాలేనని నిపుణులు చెబుతున్నారు.
1. హిడెన్ సోడియం (కంటికి కనిపించని ఉప్పు):
మనం వంటల్లో వేసే నార్మల్ ఉప్పు కాకుండా.. ఇంట్లోనే వాడే కొన్ని పదార్థాల్లో సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి రోజూ ఇంటి భోజనంలో నంజుకునే ఊరగాయలు, అప్పడాలు, వడియాలలో ఉప్పును ప్రిజర్వేటివ్గా విపరీతంగా వాడుతుంటారు. ఇవి ఇంట్లో చేసినవే అయినప్పటికీ.. వల్ల శరీరంలోకి అధికంగా సోడియం చేరుతుంది. ఇది రక్తనాళాలపై ఒత్తిడిని పెంచి బీపీ రావడానికి ముఖ్య కారణం అవుతుంది.
2. రీ-హీటెడ్ ఆయిల్స్ (నూనెను పదే పదే మరగబెట్టడం):
ఇంట్లో పూరీలు, గారెలు లేదా బజ్జీలు వేసినప్పుడు మిగిలిపోయిన నూనెను పారబోయడం ఇష్టం లేక, మరుసటి రోజు కూరల్లో వాడుతుంటాం. ఇలా నూనెను పదే పదే వేడి చేయడం వల్ల అందులో ‘ట్రాన్స్ ఫ్యాట్స్’ రీ రాడికల్స్ తయారవుతాయి.ఇవి రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ను పేరుకుపోయేలా చేసి, రక్తం ప్రసరణకు అడ్డంకులు సృష్టిస్తాయి. ఫలితంగా గుండె ఎక్కువ ఒత్తిడితో రక్తాన్ని పంప్ చేయాల్సి వస్తుంది.అదే హై బీపీకి దారి తీస్తుంది.
3. శారీరక శ్రమ లేకపోవడం :
ఇంట్లో ఎంత మంచి పౌష్టికాహారం తిన్నా, తిన్న ఆహారానికి తగ్గట్లుగా ఒంటికి శ్రమ లేకపోతే ప్రయోజనం శూన్యం. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఆఫీసుల్లో గంటల తరబడి కదలకుండా కూర్చుని ఉద్యోగాలు చేసేవారిలో మెటబాలిజం రేటు పడిపోతుంది. వ్యాయామం లేకపోవడం వల్ల రక్తనాళాల స్థితిస్థాపకత తగ్గి, హోమ్ ఫుడ్ తినే వారిలో సైతం బీపీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి.
4. మానసిక ఒత్తిడి, నిద్రలేమి :
బీపీ అనేది కేవలం తినే తిండికి మాత్రమే సంబంధించింది కాదు. ప్రస్తుత కాలంలో క్రానిక్ స్ట్రెస్ (తీవ్రమైన మానసిక ఒత్తిడి), సరిగ్గా నిద్రపోకపోవడం అనేవి ప్రధాన విలన్లుగా మారాయి. మీరు అమృతం లాంటి ఇంటి భోజనం తిన్నా కూడా.. మనసులో నిరంతరం ఒత్తిడి ఉంటే శరీరంలో ‘కార్టిసోల్’, ‘అడ్రినలిన్’ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి గుండె వేగాన్ని, రక్తపోటును తాత్కాలికంగా పెంచుతాయి. ఇది ఇలాగే ప్రతి రోజూ కొనసాగితే అది పర్మనెంట్ హై బీపీగా మారుతుంది.
5. తెల్లటి పదార్థాల వాడకం:
ఇంటి వంటల్లో మనం వాడే తెల్లటి బియ్యం, మైదా, పంచదార వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు శరీరంలో ఇన్ఫ్లమేషన్ను (వాపులను) పెంచుతాయి. ఇవి పరోక్షంగా బరువు పెరిగేలా చేసి.. ఇన్సులిన్ రెసిస్టెన్స్కు కారణమవుతాయి. దీని ప్రభావం నేరుగా రక్తనాళాలపై పడుతుంది.
Also Read: బాడీలో ఈ మార్పులు కనిపిస్తే వడదెబ్బ తగిలినట్లే.. బీ కేర్ఫుల్ బాస్!
బీపీ పెరగకుండా వంటింట్లో చేయాల్సిన మార్పులు:
ఉప్పు వాడకం తగ్గించాలి: ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 5 గ్రాముల (ఒక టీస్పూన్) కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. వంటల్లో ఉప్పు కాస్త తగ్గించి, రుచి కోసం నిమ్మరసం లేదా ఇతర హెర్బ్స్ వాడుకోవచ్చు.
పొటాషియం పెంచాలి: సోడియం ప్రభావాన్ని తగ్గించాలంటే ఆహారంలో పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు, ఆకుకూరలు, కొబ్బరినీళ్లు చేర్చుకోవాలి.
ప్యాకేజ్డ్ మసాలాలు వద్దు: ఇంట్లోనే నూరుకున్న తాజా మసాలాలు వాడటం మంచిది. మార్కెట్లో దొరికే రెడీమేడ్ పౌడర్లలో ‘మోనోసోడియం గ్లుటామేట్’ (టేస్టింగ్ సాల్ట్) ఉండే అవకాశం ఉంది.
కేవలం ఇంట్లో వండుకుని తింటున్నాం కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనం ఏం తింటున్నాం అనే దానితో పాటు ఎంత ప్రశాంతంగా ఉంటున్నాం. ఎంత శారీరక శ్రమ చేస్తున్నాం అనేది కూడా ముఖ్యం. కాబట్టి.. రోజూ కాసేపు వాకింగ్, యోగా అలవాటు చేసుకుని, వంటల్లో ఉప్పు-నూనె తగ్గించుకుంటే.. హై బీపీ అనే సైలెంట్ కిల్లర్ నుంచి మనల్ని మనం సులభంగా కాపాడుకోవచ్చు.