‘ఈద్ ఉల్ అధా’ అంటే ముస్లింలు జరుపుకునే బక్రీద్ పండుగ. ఇస్లాం మతంలో అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి బక్రీద్. ఈ పండుగ సందర్భంగా ముస్లింలందరూ ప్రార్థనలు, దానధర్మాలు చేస్తూ జరుపుకుంటారు. అయితే అర్హత ఉన్న ముస్లింలు జంతు బలి కూడా ఇస్తారు. ఈ పండుగ విశ్వాసం, విధేయత, త్యాగం, దయ గురించి బోధిస్తుంది.
బక్రీద్ సమయంలో మేకలను బలి ఇవ్వడానికి వెనుక మతపరమైన, ఆధ్యాత్మిక కారణం ఉంది. ఈ సంప్రదాయం ప్రవక్త ఇబ్రహీం, ఆయన కుమారుడు ప్రవక్త ఇస్మాయిల్ కథతో ముడిపడి ఉంది.
ఈద్ ఉల్ అధాను త్యాగాల పండుగ అని కూడా అంటారు. ఇస్లామిక్ నెల ధుల్ హిజ్జా నెలలో ఈ పండుగ జరుపుకుంటారు. సౌదీ అరేబియాలో హజ్ పూర్తి అయిన వెంటనే ఈ పండుగ చేసుకుంటారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రత్యేక ఈద్ ప్రార్థనలు చేస్తారు.
ఖురాన్ ప్రకారం.. ప్రవక్త ఇబ్రహీం అల్లాహ్(ఈశ్వరుడు, సృష్టికర్త) కు పూర్తి విధేయత చూపిన భక్తుడు. ఒకరోజు అల్లాహ్ ఆయన విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆయన కలలో దైవదూతలు కనిపించి, ఆయన ప్రియమైన కుమారుడు ఇస్మాయిల్ బలి ఇవ్వాలని.. ఇది భగవంతుడి ఆదేశమని చెప్పారు.
ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడు చిన్న బాలుడైన ఇస్మాయిల్ను తీసుకొని ఇంటికి దూరంగా నిర్మానుష ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. ప్రవక్త ఇబ్రహీంకు వృద్ధాప్యం వరకు సంతానం లేదు. ఆయన దశాబ్దాల పాటు సంతానం కోసం ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడు. అలా ఎన్నో ఆశల తరువాత పుట్టిన బిడ్డ ఇస్మాయిల్. అందుకే ఇస్మాయిల్ అంటే ప్రవక్త ఇబ్రహీంకు ఎంతో ఇష్టం. అలాంటి తన కుమారుడిని బలి ఇవ్వాలని ఆ దేవుడు ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశం కంటే తనకు ఏదీ ముఖ్యంకాదని.. సృష్టికర్త ఆదేశించినట్లు తన కుమారుడిని బలివ్వాలని నిర్ణయించుకున్నాడు.
ఇదంతా తన కుమారుడు ఇస్మాయిల్తో నిజాయితీగా చెప్పాడు. ఆ సమయంలో ఇస్మాయిల్కు దాదాపు 9 ఏళ్ల వయసు. చిన్నారి కూడా అల్లాహ్ ఆదేశానికి పూర్తి విధేయత చూపాడు. భయం లేకుండా, సంతోషంగా తన తండ్రికి అల్లాహ్ పెట్టిన పరీక్షకు బలి అయ్యేందుకు సిద్ధపడ్డాడు. నవ్వుతూ తన గొంతుపై కత్తి నూరాలని తండ్రిని కోరాడు. ఈ తండ్రి, కొడుకుల విశ్వాసం, విధేయత ముస్లింలందరికీ ఆదర్శం అయ్యాయి.
ఇస్మాయిల్ను ప్రవక్త ఇబ్రహీం బలి ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు.. ఇస్మాయిల్ గొంతుపై ఆయన నూరిన కత్తి పనిచేయలేదు. ఒక్కసారిగా ఆకాశం నుంచి అల్లాహ్ ఆదేశం వినిపించింది. ఇబ్రహీం భక్తి, విధేయతను అల్లాహ్ అంగీకరించాడు. ఇస్మాయిల్ స్థానంలో ఒక గొర్రెను బలి ఇవ్వమని ఆదేశించాడు. ఈ ఘటన.. విశ్వాసం, ఓర్పు, అల్లాహ్కు విధేయతకు చిహ్నంగా మారింది.
ప్రవక్త ఇబ్రహీం విధేయతను గుర్తుచేసుకోవడానికి ముస్లింలు జంతువులను బలి ఇస్తారు. ఈ బలి.. అల్లాహ్కు విధేయత, దయ, దానధర్మాల ప్రాముఖ్యతను బోధిస్తుంది. మేక, గొర్రె, ఒంటె, ఎద్దు, ఆవు, బర్రె లాంటి జంతువులను
సాధారణంగా బలి (కుర్బానీ) ఇస్తారు.
Also Read: ఫోన్ పాస్వర్డ్ మర్చిపోయారా? సర్వీస్ సెంటర్ వెళ్లాల్సిన అవసరం లేదు.. ఈ సెట్టింగ్స్ చేస్తే చాలు
కుర్బాని మాంసం పంచడం
ఈద్ ఉల్ అధాలో మాంసాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. ఒక భాగం పేదలకు, రెండవ భాగం బంధువులకు, మూడవ భాగం కుటుంబానికి కేటాయించి పంచుతారు. ఇది కేటాయింపులు ఇస్లాంలో సామాజిక సమానత్వం, దయను ప్రోత్సహిస్తాయి.
బక్రీద్ పండుగ.. ప్రవక్త ఇబ్రహీం, ఇస్మాయిల్ విశ్వాసం, విధేయత, త్యాగానికి సూచిక. జంతు బలి త్యాగం, దానం, దయ గురించి బోధిస్తుంది.