Bus Accident: అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి వద్ద 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు వేగంగా వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు బస్సు మూడు పల్టీలు కొట్టి, పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మొత్తంగా 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, వారిలో 13 మంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి క్షతగాత్రులను రక్షించే పనుల్లో నిమగ్నమయ్యారు.
తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం వెంటనే అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. లారీని తప్పించబోయే ఈ ఘోరం జరిగిందని ప్రయాణికులు కన్నీరుమున్నీరవుతూ చెబుతున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: బాడుదు మొదలైంది.. సీఎన్జీ ధరలు పెంపు, రెండువారాల్లో నాలుగోసారి