Electrolyte Imbalance: వేసవి కాలం వచ్చిందంటే చాలు, అందరూ చెప్పే మాట “ఎక్కువ నీళ్లు తాగండి” అని. కానీ.. ఈ సలహా సగం మాత్రమే నిజం. ఎందుకంటే ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక ఘటన మనల్ని ఉలిక్కిపడేలా చేసింది. ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రోజంతా ఎండలో తిరుగుతూ 5 లీటర్ల నీరు తాగాడు. కానీ ఆహారం తీసుకోలేదు. ఫలితంగా సాయంత్రానికి స్పృహ కోల్పోయి ఐసీయూలో చేరాడు. అతనికి వచ్చిన సమస్య హైపోనాట్రేమియా .
నీరు మాత్రమే తాగితే ఏం జరుగుతుంది?
మనం ఎండలో ఉన్నప్పుడు చెమట రూపంలో కేవలం నీరు మాత్రమే కాదు, సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి ముఖ్య లవణాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. ఇవి మన కండరాలు, నరాలు , గుండె సరిగ్గా పనిచేయడానికి అవసరం. ఆ సమయంలో మనం కేవలం ‘ప్లెయిన్ వాటర్’ మాత్రమే అతిగా తాగితే.. రక్తంలో ఉన్న కొద్దిపాటి సోడియం కూడా పలచబడిపోతుంది. దీని వల్ల మెదడు కణాలలో వాపు వచ్చి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.
ప్రధాన సమస్యలు:
హైపోనాట్రేమియా (సోడియం తగ్గడం): నీరు ఎక్కువై సోడియం తగ్గినప్పుడు తల తిరగడం, వికారం, మాట తడబడటం, ఫిట్స్ వంటివి రావచ్చు.
హైపర్ నాట్రేమియా (నీరు తగ్గడం): అసలు నీరు తాగకపోవడం వల్ల సోడియం గాఢత పెరిగి కణాలు కుచించుకుపోతాయి. ఇది కూడా ప్రమాదకరమే.
పొటాషియం లోపం: చెమట ద్వారా పొటాషియం పోతే కండరాల నొప్పులు, నీరసం , గుండె లయ తప్పడం వంటివి జరుగుతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
కేవలం నీరు మాత్రమే వద్దు: ఎండలో తిరిగేటప్పుడు నీటితో పాటు ORS (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్), మజ్జిగ, కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసం తీసుకోవాలి.
ఆహారం : ఖాళీ కడుపుతో ఎండలో తిరగడం అత్యంత ప్రమాదకరం. పండ్లు, ఉప్పు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి లవణాలు అందుతాయి.
లక్షణాలు గమనించండి: తలనొప్పి, నీరసం, అయోమయం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే.. డాక్టరును సంప్రదించాలి.
గుర్తుంచుకోండి.. వేసవిలో ప్రాణం కాపాడేది కేవలం నీరు మాత్రమే కాదు, నీటితో పాటు లవణాలు కూడా!