CM Chandrababu: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి దాదాపు రెండేళ్లు గడుస్తోంది. మరో మూడేళ్లలో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నేతలపై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేల పని తీరుపై ప్రజాభిప్రాయ సేకరణ ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నామని తేల్చేచెప్పేశారు. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రుల్లో చిన్నపాటి టెన్షన్ మొదలైంది.
పామర్రు సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
సీఎం చంద్రబాబు కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పమిడిముక్కలలో ఏర్పాటు చేసిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. నేతల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.
ప్రజల నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఒకవేళ సభకు వచ్చిన ప్రజలు చేతులెత్తకుంటే ఎమ్మెల్యే కరెక్టు చేసుకోవాలన్నారు. ఒకవేళ ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోకుంటే మీ తరపున నేను ఉంటానని, ఎమ్మెల్యే తరపున ఉండనని తేల్చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు సమర్థవంతంగా పని చేయాలన్నారు.
ఇవాళ్టి నుంచి ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయ సేకరణ మొదలు
సీఎం చంద్రబాబు ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రుల పని తీరుపై అంతర్గతంగా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. సరిగా పని చేయనివారిని పిలిచి క్లాస్ తీసుకున్న సందర్భాలు ఇటీవల కాలంలో కనిపించాయి. ఇప్పుడు మాత్రం ప్రజల నుంచి అభిప్రాయసేకరణ తీసుకుంటామని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి ప్రకటనతో కొందరి నేతల్లో అప్పుడే టెన్షన్ మొదలైంది.
విపక్షాలు మహిళా రిజర్వేషన్ను అడ్డుకున్నాయి కానీ, త్వరలో ఆడబిడ్డలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు రాబోతున్నాయని తేల్చి చెప్పారు. అన్నిరంగాల్లో మహిళలు రాణించాలన్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలనేది తన ఆలోచన అని, అమరావతికి ఈఎస్ఐ ఆసుపత్రి తీసుకొస్తామన్నారు.
ALSO READ: ఏపీ ప్రభుత్వానికి చేరిన తిరుమల లడ్డు నివేదిక.. అధికారులపై చర్యలు, రాజకీయ నేతల మాటేంటి?
పనిలో పనిగా వైసీపీపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. వైసీపీ కాదని, అది గొడ్డలి పార్టీ అని తేల్చేశారు. నేరప్రవృత్తి కలిగిన వ్యక్తులు రాజకీయాలకు పనికి రారని, అతనికి ఓ మానసిక సమస్య ఉందన్నారు. అందరినీ మోసం చేయడం, అవకాశం ఇస్తే అందర్నీ నాశనం చేయడమేనని అన్నారు. ఐదేళ్లు ఏం జరిగిందో మీరే చూశారన్నారు.
అధికారంలోకి వచ్చిన తొలిరోజు ప్రజా వేదికను కూల్చివేశారని అన్నారు. పోలవరం పూర్తి అయితే ఓ వరంగా మారేదని అన్నారు. నీటి ఎద్దడి పోయేదని, అలాంటి ప్రాజెక్టును నాశనం చేశారని, దేవతల రాజధాని అమరావతిని శ్మశానం, ఏడారి అంటూ రకరకాలుగా కామెంట్స్ చేశారని గుర్తు చేశారు.