Alcohol: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. కానీ ఆల్కహాల్ తీసుకునేటప్పుడు కొన్ని రకాల మందులు వాడటం ప్రాణాంతకమని చాలామందికి తెలియదు. కాలేయ సంబంధిత వ్యాధుల నిపుణులుహెచ్చరిస్తున్న దాని ప్రకారం, మద్యం, మందుల కలయిక కాలేయంపై తీవ్రమైన ఒత్తిడిని పెంచి. శాశ్వత నష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ వంటి సాధారణ మందులను మద్యంతో కలిపి వాడినప్పుడు అవి విషతుల్యంగా మారుతాయి. ఈ ప్రమాదకరమైన కలయికలు, వాటి వల్ల కలిగే పరిణామాల గురించి వివరంగా తెలుసుకుందాం.
మద్యం, మందులు: ఎందుకు ప్రమాదకరం ?
మనం తీసుకునే ఆహారం, మందులు లేదా మద్యం.. ఏదైనా సరే కాలేయం ద్వారానే మెటబాలైజ్ (జీర్ణం) అవ్వాలి. కాలేయం వీటిని విచ్ఛిన్నం చేసి శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపుతుంది. అయితే.. మద్యంతో పాటు కొన్ని మందులు తీసుకున్నప్పుడు కాలేయం రెండింటినీ ఒకేసారి ప్రాసెస్ చేయలేక ఇబ్బంది పడుతుంది. దీని వల్ల రక్తంలో మందుల సాంద్రత ప్రమాదకర స్థాయికి పెరగుతుంది. లేదా కాలేయ కణాలు కూడా దెబ్బతినవచ్చు.
మద్యంతో అస్సలు తీసుకోకూడని మందులు:
నిపుణుల ప్రకారం ఈ కింది మందులను మద్యంతో కలిపి వాడటం అత్యంత ప్రమాదకరం.
1. పెయిన్ కిల్లర్స్ (నొప్పి నివారణ మందులు): మనకు సాధారణంగా అందుబాటులో ఉండే పారాసెటమాల్ వంటి మందులు మద్యంతో కలిస్తే కాలేయానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. మద్యం సేవించే వారిలో పారాసెటమాల్ను విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో ‘టాక్సిక్ బైప్రొడక్ట్స్’ విడుదలవుతాయి. ఇవి కాలేయ వైఫల్యానికి దారితీస్తాయి. అలాగే ఆస్పిరిన్, ఇబూప్రోఫెన్ వంటి మందులు కడుపులో అల్సర్లు, రక్తస్రావానికి కారణమవుతాయి.
2. యాంటీబయాటిక్స్: మెట్రోనిడాజోల్, టినిడాజోల్ వంటి కొన్ని యాంటీబయాటిక్స్ వాడుతున్నప్పుడు మద్యం తాగితే వికారం, వాంతులు, తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని ‘డైసల్ఫిరామ్ వంటి ప్రతిచర్య’ అని పిలుస్తారు.
3. నిద్ర మాత్రలు, యాంటీ-డిప్రెసెంట్స్: మద్యం స్వతహాగా మెదడు పనితీరును నెమ్మదిస్తుంది. నిద్ర మాత్రలు లేదా మానసిక ఒత్తిడిని తగ్గించే మందులను మద్యంతో కలిపితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు. గుండె ఆగిపోవచ్చు లేదా కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది.
4. మధుమేహం, బీపీ మందులు: డయాబెటిస్ మందులు వాడుతూ మద్యం తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోతాయి. అలాగే బీపీ మందులతో కలిపి తాగితే రక్తపోటు చాలా తగ్గిపోయి మైకం రావచ్చు.
Also Read: ఇక డయాలసిస్ అవసరం ఉండదా ? కిడ్నీలను పునరుజ్జీవింపజేసే కొత్త ట్రీట్మెంట్
కాలేయం ఇచ్చే హెచ్చరిక సంకేతాలు
మద్యం, మందుల ప్రభావం వల్ల కాలేయం దెబ్బతింటున్నప్పుడు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది.
కళ్లు, గోర్లు పసుపు రంగులోకి మారడం (కామెర్లు).
విపరీతమైన అలసట, నీరసం.
కడుపు పైభాగంలో కుడి వైపున నొప్పి.
ఆకలి మందగించడం, వాంతులు కావడం.
ఆరోగ్యంగా ఉండాలంటే మద్యం అలవాటును మానుకోవడం ఉత్తమం. ఒకవేళ మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధికి మందులు వాడుతుంటే, మద్యం సేవించే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. “ఒక్కసారి తాగితే ఏమవుతుందిలే” అనే నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తీసుకురావచ్చు. మందులు వేసుకున్న కొన్ని గంటల తర్వాత లేదా మద్యం తాగడం కూడా సురక్షితం కాదు.