అజాగ్రత్తగా ఉంటే కరోనా వైరస్ ఏ ఒక్కర్నీ వదిలిపెట్టదనే విషయం మనందరికీ తెలుసు. జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు కరోనాని తప్పించుకోలేం. అయితే కరోనా వస్తే ఎవరికి ఎక్కువ నష్టం..? ఏ వయసువారికి అది ఎక్కువ ప్రమాదకరం..? ఎవరు మరింత అప్రమత్తంగా ఉండాలి..? ఇలాంటి విషయాలపై నిపుణులైన డాక్టర్లు ఏమంటున్నారో ఓసారి చూద్దాం.
వృద్ధులకు డేంజర్..
కొవిడ్ వైరస్ అన్ని వయసులవారినీ ఇబ్బంది పెడుతుంది. అయితే వయసు మళ్లినవారిని మరింతగా కంగారు పెడుతుంది. సహజంగానే వారిలో రోగనిరోధక శక్తి కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి.. కొవిడ్ వైరస్ మరింతగా ఇబ్బంది పెడుతుంది. మరణాలు కూడా వారిలోనే ఎక్కువ అని తేలింది. వృద్ధులు అంటే 50 సంవత్సరాల వయసుకంటే ఎక్కువ ఉన్నవారు, మరీ ముఖ్యంగా 65 ఏళ్లు దాటినవారు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ కూడా వారికి సులభంగా అటాక్ అవుతుంది. వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారిలోని తెల్ల రక్తకణాలు వైరస్ తో పోరాడటం కష్టం. భారత్ లో చాలామంది వృద్ధులు డయాబెటిస్, హైబీపీ, గుండె జబ్బులతో బాధపడుతున్నారు. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వారికి ఉన్నాయి. అలాంటివారు కరోనా సోకితే మరింతగా కుంగిపోతారు. కోలుకోవడం కూడా కష్టం. ఇతర ఆరోగ్య సమస్యలు మరింతగా ఇబ్బంది పెడతాయి. దీంతో కరోనా కారణంగా మరణించే అవకాశం కూడా ఎక్కువ.
పరిశోధనల ఫలితాలు..
పలు పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. అగ్మెంటెడ్ హ్యూమన్ రీసెర్చ్ 2020లో జరిపిన ఒక అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది. భారతదేశంలో 50 ఏళ్లు పైబడినవారు కొవిడ్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై మరణించే అవకాశం ఎక్కువ ఉందని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. అదే ఏడాది జరిగిన సైన్స్డైరెక్ట్ అధ్యయనంలో కూడా వయసుపైబడినవారిపై కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉందని తేలింది. 75 ఏళ్లు పైబడినవారికి కొవిడ్ వస్తే 10వేలకు మరణాల రేటు 931.6 గా ఉంది. 60–74 ఏళ్ల వయసువారిలో మరణాల రేటు ప్రతి మిలియన్ కు 571.2 గా ఉంది. కేవలం భారత్ లోనే కాదు, అమెరికాలో కూడా 65 ఏళ్లు పైబడిన వారు కొవిడ్ ప్రభావానికి గురైతే మరణాల రేటు మిగతా వారితో పోల్చి చూస్తే 60 నుంచి 340 రెట్లు అధికంగా ఉందట.
టీకాలతో రక్షణ..
కొవిడ్ వేవ్ మళ్లీ మొదలవుతుందన్న సంకేతాల నేపథ్యంలో వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఢిల్లీకి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ సందీప్ బుధిరాజా. ప్రస్తుతం వ్యాపిస్తోన్న COVID-19 JN.1 వేరియంట్ అంత బలంగా లేకపోయినా వృద్ధుల్లో మాత్రం తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. ఇక 40 నుంచి 64 ఏళ్ల వయసు ఉన్నవారు కూడా కొవిడ్ తో జాగ్రత్తగానే ఉండాలి. అలాంటి వారిలో షుగర్, హైబీపీ, ఒబెసిటీ..వంటి సమస్యలున్నవారికి ఇది ఎక్కువ చేటు చేస్తుంది. అలాంటివారి శరీరం వైరస్ ని తట్టుకోవడం కష్టం. మధ్య వయసులో ఉన్నవారు కొంతవరకు టీకాలతో రక్షణ పొందవచ్చు కానీ, ఇతరత్రా కాంప్లికేషన్స్ ఏవీ లేకుండా చూసుకోవాలి. అంటే ఆయా వ్యాధులకు వారు సరైన వైద్యం తీసుకుంటూ ఉండాలి.
వ్యాప్తి చేసే గ్రూప్..
అంతకంటే చిన్న వయసు అంటే.. 20 నుంచి 49 సంవత్సరాల మధ్య వారిలో కొవిడ్ విస్తృతంగా వ్యాపిస్తోందని సర్వేలు చెబుతున్నాయి. ఈ ఏజ్ గ్రూప్ వారిలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి 72.2 శాతంగా ఉందని అంటున్నారు. స్నేహితులను కలవడం, తరచూ బయట తిరగడం వంటి కారణాల వల్ల 20 నుంచి 49 సంవత్సరాల మధ్యవారికి కొవిడ్ సోకే అవకాశం ఎక్కువ. అయితే వీరిని ఆ వైరస్ పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఆస్పత్రిపాలయ్యే అవకాశాలు కూడా తక్కువ. కానీ ఈ ఏజ్ గ్రూప్ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణంగా ఉంది. పిల్లలు, టీనేజర్లు.. అంటే పురిటి బిడ్డలనుంచి 19 సంవత్సరాల వయసు మధ్యలోనివారిలో వైరస్ వ్యాప్తి చెందినా వారిని కొవిడ్ పెద్దగా ఇబ్బంది పెట్టదని తేలింది. భారతదేశంలో రెండో వేవ్లో 0–19 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో ఆస్పత్రిలో చేరినవారు కేవలం 5.8 శాతం మాత్రమే. మొదటి వేవ్ లో ఇంకా తక్కువగా కేవలం 4.2 శాతం మంది మాత్రమే ఆస్పత్రిలో చేరారు. అంటే ఈ వయసువారిలో కొవిడ్ వ్యాప్తి చాలా తక్కువ, ఒకవేళ కొవిడ్ వైరస్ సోకినా, వారికి తక్కువ హాని జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
బీ అలర్ట్..
ప్రస్తుతం భారత్ లో కొవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇటీవలే కొవిడ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. కేరళలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ దశలో అప్రమత్తత అత్యవసరం అని చెబుతున్నారు వైద్య నిపుణులు.