Actress Sarada :గత కొన్ని సంవత్సరాలుగా సినీ పరిశ్రమకు విశేష సేవలు అందిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సెలబ్రిటీలను గుర్తించి ఆయా ప్రభుత్వాలు ప్రతిష్టాత్మక అవార్డులతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి అందరి ఫేవరెట్ హీరోయిన్గా మారిన ప్రముఖ నటి శారద (Sarada) కు అరుదైన గౌరవం లభించింది. మలయాళ చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన జీవితకాల సేవలకు గానూ కేరళ ప్రభుత్వ అత్యున్నత సినీ పురస్కారమైన “జేసీ డేనియల్ అవార్డు- 2024″కు ఆమె ఎంపికయ్యారు.
ఈ ప్రతిష్టాత్మక అవార్డు కింద రూ.5లక్షల నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపికను ఆమెకు అందజేస్తారు. ఇకపోతే జనవరి 25న తిరువనంతపురంలో జరిగే కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా శారదా ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ఈ విషయాన్ని కేరళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ అధికారికంగా ప్రకటించింది.. ఇదిలా ఉండగా ఈ కమిటీలో నటి ఊర్వశి, సినీ నిర్మాత బాలు కిరియత్ సభ్యులుగా.. కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడమీ కార్యదర్శి సి.అజోయ్ కన్వీనర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ విషయం తెలిసి పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్స్ శారదకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
శారదా విషయానికి వస్తే.. 1945 జూన్ 25న గుంటూరు జిల్లా తెనాలిలో వెంకటేశ్వర్లు, సత్యవతి దంపతులకు జన్మించారు. 1996లో 11వ లోక్సభకు తెనాలి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన ఈమె..అంతకుముందు బాల నటిగానే సినీ జీవితాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా తన సినీ కెరియర్ లో మూడుసార్లు ఊర్వశి అవార్డులను అందుకొని ఊర్వశి శారదగా ప్రసిద్ధి చెందారు.
ఇద్దరు మిత్రులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు . 1968 లో వచ్చిన తులాభారం, 1972లో వచ్చిన స్వయంవరం చిత్రాలకు గాను ఏకంగా ఉత్తమ నటిగా నేషనల్ అవార్డులు అందుకున్నారు. అలాగే 1977లో తెలుగు చిత్రం నిమజ్జనం సినిమాతో మూడోసారి నేషనల్ అవార్డు అందుకొని రికార్డు సృష్టించారు. ఇక ఈమె నటించిన తెలుగు చిత్రాలు విషయానికొస్తే.. మేజర్ చంద్రకాంత్, అనసూయమ్మ గారి అల్లుడు, జస్టిస్ చౌదరి, ప్రతిధ్వని, అత్తా కోడళ్ళు , మురళీకృష్ణ, ఆడది, రొటేషన్ చక్రవర్తి, ఇంద్రధనస్సు, ఊర్వశి , నిమజ్జనం ,శారదా, బలిపీఠం వంటి చిత్రాలలో నటించారు.
ALSO READ:AOR 2days Collections: 2 రోజుల్లోనే డబుల్ కలెక్షన్స్.. రాజుగారి స్పీడ్ మామూలుగా లేదుగా!
ఇలా ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె.. ఈమధ్య కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా హీరోలకు బామ్మగా నటిస్తూ తన అద్భుతమైన నటనతో ఇప్పటికీ ఎంతోమంది హృదయాలను దోచుకుంటున్నారు శారద. ఏదేమైనా ఇప్పుడు శారదాకు కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డును అందించి సత్కరించడంతో అందరూ ఆమె కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.