Allu Arjun: హైదరాబాద్లో అల్లు కుటుంబానికి చెందిన కొత్త థియేటర్ ప్రాజెక్ట్ పెద్ద స్థాయిలో ప్రారంభం కానుంది. కోకాపేటలో నిర్మించిన అల్లు సినిమాస్ ప్రాపర్టీ మార్చి 12, 2026న ఘనంగా ప్రారంభం కానుంది. ఈ థియేటర్ నగరంలో అత్యాధునిక సదుపాయాలతో రూపొందించబడిన ప్రీమియం సినిమా హాల్గా నిలవనుందని సమాచారం.
ఈ ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో పాటు అల్లు కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం సినీ మరియు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
ప్రారంభ కార్యక్రమం పూర్తైన తర్వాత థియేటర్లో టెక్నికల్ టెస్ట్ రన్స్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో కొన్ని ఎంపిక చేసిన సినిమాలను ప్రదర్శించి సౌండ్ సిస్టమ్, ప్రొజెక్షన్ వ్యవస్థలు సరిగా పనిచేస్తున్నాయా అని పరీక్షిస్తారు. ఈ టెస్టింగ్ దశలో F1 సినిమా ప్రదర్శించే అవకాశముందని సమాచారం.
టెక్నికల్ టెస్టింగ్ పూర్తైన తరువాత ఉగాది పండుగ రోజైన మార్చి 19న ఈ థియేటర్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో హైదరాబాద్లో సినిమా ప్రేమికులకు మరో కొత్త ఆధునిక.. థియేటర్ అందుబాటులోకి రానుంది.
ఇటీవల అల్లు అర్జున్.. రేవంత్ రెడ్డి మధ్య సాన్నిహిత్యం పెరుగుతోందన్న చర్చలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పుష్ప: ది రూల్ సినిమా విడుదల సమయంలో జరిగిన స్టాంపీడ్ ఘటన తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఆ సమయంలో సినీ ఇండస్ట్రీ మరియు ప్రభుత్వ మధ్య కొన్ని ఉద్రిక్తతలు కనిపించాయి.
అయితే ఇటీవల అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్.. వివాహ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొనడం, ఇద్దరూ స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఇద్దరి మధ్య సంబంధాలు మరింత మెరుగయ్యాయని అభిమానులు భావిస్తున్నారు.
ఇప్పుడు కోకాపేటలో నిర్మించిన అల్లు డాల్బీ సినిమాస్ ప్రారంభోత్సవాన్ని రేవంత్ రెడ్డి చేయడం మరోసారి చర్చకు కారణమైంది. ఇది సినీ పరిశ్రమ మరియు రాష్ట్ర ప్రభుత్వ మధ్య సానుకూల సంబంధాలకు సంకేతంగా భావిస్తున్నారు.
Also Read: Allu Cinemas:అల్లు అర్జున్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. రేపు అల్లు సినిమాస్పై అప్డేట్!