Chiranjeevi: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా చిరంజీవి కిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్యాన్సర్పై ప్రజలకు ఎంతో ఉపయోగపడే కీలక సూచనలు చేశారు. క్యాన్సర్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దని, శరీరం చెప్పే మాటను తప్పకుండా వినాలని ఆయన పిలుపునిచ్చారు.
“శరీరంలో వచ్చే చిన్న చిన్న మార్పులను కూడా మనం గమనించాలి. నాకు రాదులే అన్న ధోరణిలో ఉండకూడదు” అని చిరంజీవి అన్నారు. చాలామంది క్యాన్సర్ అంటే భయపడుతూ పరీక్షలు చేయించుకోవడం ఆలస్యం చేస్తారని చెప్పారు. అదే పెద్ద ప్రమాదంగా మారుతుందని హెచ్చరించారు.
క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తిస్తే దాదాపు 90 శాతం వరకు నయం చేసే అవకాశాలు ఉన్నాయని చిరంజీవి గుర్తు చేశారు. “మొదటి దశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు” అని స్పష్టం చేశారు. అందుకే ప్రతి ఒక్కరూ రెగ్యులర్ హెల్త్ చెకప్లు చేయించుకోవాలని సూచించారు.
మహిళలు, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో వ్యాక్సినేషన్ చాలా ముఖ్యమని ఆయన తెలిపారు. “చిన్న వయసులోనే వ్యాక్సిన్లు వేయించడం ద్వారా కొన్ని రకాల క్యాన్సర్లను నివారించవచ్చు” అని మహిళలకు సూచించారు. దీనిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
అలాగే జీవనశైలి మార్పుల గురించి కూడా చిరంజీవి మాట్లాడారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం వల్ల క్యాన్సర్ వంటి మహమ్మారిని దూరం పెట్టవచ్చని చెప్పారు. “మన జీవనశైలి మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది” అని అన్నారు.
ఈ సందర్భంగా తన స్నేహితుడి అనుభవాన్ని చిరంజీవి ఉదాహరణగా చెప్పారు. క్యాన్సర్ను ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం వల్ల తన స్నేహితుడు గత పదేళ్లుగా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఇది ముందస్తు గుర్తింపు ఎంత ముఖ్యమో చెబుతున్న ఉదాహరణ అని అన్నారు.
భవిష్యత్తులో క్యాన్సర్పై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు తన వంతు బాధ్యతగా షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి సిద్ధంగా ఉన్నట్లు చిరంజీవి ప్రకటించారు. చివరగా ఆయన, “క్యాన్సర్ను తరిమికొట్టడం మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి” అని అన్నారు. ఈ మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి.
ALSO READ: Varanasi Movie: ఆ సమయంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిమాము.. ప్రియాంక చోప్రా