Janasena – BJP Alliance: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. జనసేన – బీజేపీ పార్టీలు (Janasena – BJP Allience) ఈ ఎన్నికల కోసం చేతులు కలిపాయి. మంగళవారం రాత్రి జనసేనాని, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామంచంద్ర రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భేటి అయ్యారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఇరు పార్టీలో కలిసి పోటీ చేసే అంశంపై చర్చ జరిగింది. ఇందుకు అంగీకరించిన పవన్.. బీజేపీతో కలిసి పురపోరులో రంగంలోకి దిగబోతున్నారు. ఎన్డీఏ కూటమి తరపున పవన్ స్వయంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అయితే జనసేనతో పొత్తు.. తెలంగాణలో బీజేపీకి కలిసి వస్తుందా? ఏపీ పార్టీ అయినందువల్ల ఏమైనా బెడిసికొడుతుందా? అన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మెుదలైంది.
ఫిబ్రవరి 11న తెలంగాణలో పురపోరు జరగనుంది. బీజేపీతో పోలిస్తే అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనతో పొత్తు పెట్టుకొని పవన్ ను ప్రచారంలో భాగస్వామ్యం చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఓటర్లను ఆకర్షించవచ్చని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే రాత్రికి రాత్రి పవన్ వద్దకు వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు (Ramachandra Rao), కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలంగాణలో పొత్తుపై చర్చించి.. హడావిడిగా ఐక్యతను ప్రకటించారు. కాగా, పవన్ కళ్యాణ్ కు ఏపీతో పాటు తెలంగాణలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయనతో పొత్తు కచ్చితంగా తమకు కలిసి వస్తుందని.. బీజేపీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
పురపోరులో భాగంగా తెలంగాణలో పవన్ పర్యటనకు సంబంధించిన తేదీలను జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని స్పష్టం చేసింది. జనసేన – బీజేపీ పార్టీలు కలిసికట్టుగా పోటీ చేస్తున్నప్పటికీ.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల పోటీ ఉంటుందని జనసేన మంగళగిరి కార్యాలయం అధికారికంగా పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే జనసేన కంటే గణనీయ సంఖ్యలో బీజేపీ నుంచే అభ్యర్థులు బరిలో నిలుస్తారన్న విషయం అర్ధమవుతోంది.
Also Read: Congress Party: కాంగ్రెస్ లో పాత, కొత్త నేతల లొల్లి.. టీపీసీసీ తలనొప్పిగా మారిన పంచాయతీ!
ఏపీలోని కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీలో ప్రస్తుతం భాగస్వామ్యంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ మద్దతును తీసుకోవడం ద్వారా తెలంగాణ బీజేపీ నేతలు చిక్కులు కొనితెచ్చుకోబోతున్నారన్న అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కృష్ణా జలాల పంపిణీ, నల్లమల సాగర్ వంటి విషయాల్లో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ సమయంలో పవన్ ను మున్సిపల్ పోరులో ప్రచారానికి తీసుకొస్తే.. సహజంగానే అది అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీలకు అస్త్రాలుగా మారొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబుతో పొత్తుపెట్టుకొని కాంగ్రెస్ అతిపెద్ద తప్పు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో చంద్రబాబు భుజం మీద తుపాకీ పెట్టి విపక్షాలను కేసీఆర్ టార్గెట్ చేశారు. తెలంగాణ ప్రజలను దోచుకోవడానికి తిరిగి ఏపీ పాలకులు మళ్లీ ఈ గడ్డపై అడుగుపెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పుడు పవన్ విషయంలో ఇదే జరగొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అవకాశాన్ని ఇది దెబ్బతీయవచ్చని పేర్కొంటున్నారు.
Also Read: GHMC: 10న ముగియనున్న జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు.. రూ.2 కోట్ల నిధుల హామీ అమలు ఎక్కడ?