CM Revanth: హాలీవుడ్లో మంటలు, దుబాయ్లో యుద్ధం.. ఇన్వెస్ట్ చేయడానికి హైదరాబాదే సరైన వేదిక అని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరం వేదికగా గురువారం తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులెందరో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బాలీవుడ్ వాళ్లకి ఓ విజ్ఞప్తి చేశారు. ఈ వేడుకకు హాజరైన మాధురీ దీక్షిత్ పేరును ప్రస్తావిస్తూ.. హైదరాబాద్ విశిష్టతను ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
‘‘నేను ఈ వేదికగా మాధురీ దీక్షిత్ వంటి బాలీవుడ్ వాళ్లకి కూడా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను.. హాలీవుడ్లో మంటలు రేగుతున్నాయి, దుబాయ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, భవనాలు ఎలా కూలిపోతున్నాయో తెలియంది కాదు. కానీ, ఈరోజు హైదరాబాద్లో మనం ఎంతో ప్రశాంతంగా ఈ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. మన జవాన్లు పాకిస్తాన్ సరిహద్దులో ఆపరేషన్ సింధూర్ పోరాటంలో ఉన్న సమయంలోనే.. హైదరాబాద్లో ‘మిస్ వరల్డ్’ పోటీలు గ్రాండ్గా జరుపుకున్నాం. అది హైదరాబాద్ నగరం యొక్క సత్తా! మా హైదరాబాద్, మా తెలంగాణ.. ఈ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రాంతమని మీరు అర్థం చేసుకోవాలి. అందుకే నేను ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. అది హాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ కావచ్చు.. మీరు ఏదైనా పేరు పెట్టండి, ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులు ఉన్న ప్రదేశం మన హైదరాబాద్ అని చెప్పగలను.
ఇక్కడ ప్రతి ఒక్కరికీ అద్భుతమైన అవకాశాలు కల్పిస్తాం. మా ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా ఉంటుంది. నెట్ఫ్లిక్స్ ఇక్కడికి వచ్చినప్పుడే నాకు ఆ నమ్మకం కలిగింది. భవిష్యత్తులో హాలీవుడ్ సినిమాలకు హైదరాబాద్ వేదిక కాబోతోంది. అందుకే చెబుతున్నా.. హాలీవుడ్ కో, దుబాయ్ కో వెళ్లకండి. దుబాయ్ పెట్టుబడులే ఇప్పుడు హైదరాబాద్కు వస్తున్నాయి. ఒకప్పుడు మనవాళ్లు దుబాయ్ వెళ్లి పెట్టుబడులు పెట్టేవాళ్లు, కానీ ఇప్పుడు కాలం మారింది.. దుబాయ్ వాళ్లే ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీ పెట్టుబడులకు నేను భరోసా ఇస్తున్నాను. మీ పెట్టుబడి ఇక్కడ అత్యంత సురక్షితం.. లాభసాటి కూడా! మా ప్రభుత్వం మీకు ఆ నమ్మకాన్ని ఇస్తోంది. ఈ వేడుకకు వచ్చి జయప్రదం చేసిన అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.