Dacoit Controversy: తెలుగు సినీ పరిశ్రమలో పాత సూపర్ హిట్ పాటలను రీమిక్స్ చేయడం ఒక ట్రెండ్గా మారింది. అయితే, ఈ క్రమంలో ఒరిజినల్ సాంగ్ సృష్టించిన కళాకారుల అనుమతి తీసుకోకపోవడం అప్పుడప్పుడు వివాదాలకు దారితీస్తుంటుంది. ఇటీవల అడివి శేష్ నటిస్తున్న ‘డెకాయిట్’ (Dacoit) సినిమా కోసం ‘హలో బ్రదర్’ చిత్రంలోని ఐకానిక్ సాంగ్ ‘కన్నెపిట్టరో’ను రీమిక్స్ చేశారు. దీనిపై సంగీత దర్శకుడు కోటి అసహనం వ్యక్తం చేయగా, నిర్మాత సుప్రియ యార్లగడ్డ తాజాగా స్పందించారు. ‘డెకాయిట్’ టీజర్లో ‘కన్నెపిట్టరో’ పాటను బ్యాక్గ్రౌండ్లో వాడారు. దీనిపై కోటి గారు స్పందిస్తూ, “కనీసం మమ్మల్ని అడగలేదు, పర్మిషన్ తీసుకుని ఉంటే బాగుండేది” అని తన బాధను వ్యక్తం చేశారు. ఒక క్లాసిక్ పాటను మళ్ళీ వాడుకున్నప్పుడు ఆ సృష్టికర్తలకు గౌరవం ఇవ్వకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
Read also-Lavanya Tripathi: మొదటి సారి వరుణ్ ను చూడగానే లావణ్య ఫీలింగ్ ..పడిపోయానంటూ!
ఈ విషయంపై సుప్రియ మాట్లాడుతూ, చట్టపరంగా తాము అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ‘హలో బ్రదర్’ సినిమా ఆల్బమ్ హక్కులు ఆదిత్య మ్యూజిక్ సంస్థ దగ్గర ఉన్నాయి. సినిమా నిర్మాతలుగా తాము ఆ సంస్థ నుండి అవసరమైన అన్ని అనుమతులు పొందామని ఆమె తెలిపారు. తాము మ్యూజిక్ కంపెనీ నుండి పర్మిషన్ తీసుకున్న విషయం కోటి గారికి చేరలేదని, అందుకే ఆయన బాధపడ్డారని సుప్రియ వివరించారు. ఈ వివాదం పెద్దది కాకుండా ఉండేందుకు సుప్రియ స్వయంగా కోటి గారి ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. “నేను ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడాను. మేమిద్దరం కలిసి నవ్వుకున్నాం. ప్రస్తుత ఇండస్ట్రీలో హక్కులు ఎలా మారుతున్నాయి, చట్టపరమైన నిబంధనలు ఎలా ఉన్నాయి అనేవి చర్చించుకున్నాం” అని ఆమె పేర్కొన్నారు.
Read also-Durandhar Movie: ‘ధురంధర్’ సినిమాపై అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. డెకాయిట్ ఎలా ఉంటదంటే?
సుప్రియ తన వివరణలో ఒక ముఖ్యమైన విషయాన్ని అంగీకరించారు. “ఒక పాటను అల్లిన మ్యూజిక్ డైరెక్టర్కు, ఆ పాటపై ఉండే మమకారం గొప్పది. ఆయన మనోభావాలు వందకు వంద శాతం కరెక్ట్. సృష్టికర్తగా తన పాట గురించి ఆయన అలా అనడంలో తప్పులేదు” అని కోటి గారి పట్ల గౌరవాన్ని చాటుకున్నారు. సాధారణంగా నిర్మాతలు హక్కులను కంపెనీలకు అమ్మేసిన తర్వాత, ఒరిజినల్ కంపోజర్లకు రాయల్టీ లేదా గుర్తింపు విషయంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. చివరికి, ఈ వివాదం ఒక సానుకూల చర్చతో ముగిసింది. ‘డెకాయిట్’ సినిమా టీమ్ కోటి గారి మధ్య ఇప్పుడు ఎటువంటి విభేదాలు లేవని, అంతా సవ్యంగా ఉందని సుప్రియ స్పష్టం చేశారు. ఇది కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిన చిన్న పొరపాటే తప్ప, ఎవరినీ తక్కువ చేయాలనే ఉద్దేశ్యం కాదని తేలిపోయింది.