Srinivas Suicide: నేరేడ్మెట్లో ఎక్సైజ్ సీఐ జ్యోతి భర్త శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తన భార్య వేధింపుల వల్లే తాను ప్రాణాలు తీసుకుంటున్నట్లు ఆయన రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
శ్రీనివాస్ రాసిన సూసైడ్ నోట్ ప్రకారం.. సీఐ జ్యోతి గత కొంతకాలంగా తనను తీవ్రంగా వేధిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆమెకు సీఐగా పదోన్నతి వచ్చినప్పటి నుండి ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తనను తరచూ బెదిరించేదని ఆరోపించారు. అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడమే కాకుండా, విడాకులు తీసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చిందని ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీనివాస్ తన సూసైడ్ నోట్లో మరో తీవ్రమైన ఆరోపణ చేశారు. తన భార్య తనను పోలీస్ స్టేషన్కు పిలిపించి మరీ బెదిరింపులకు పాల్పడేదని పేర్కొన్నారు. ఉన్నత హోదాలో ఉన్న భార్య తన అధికారాన్ని ఉపయోగించి మానసికంగా కుంగదీయడంతో, ఆ వేధింపులు భరించలేక తాను ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒక ఉన్నత స్థాయి అధికారిణిపై ఇటువంటి ఆరోపణలు రావడం శాఖాపరంగా కూడా చర్చనీయాంశమైంది.
Also Read: ‘ఆ నలుగురు బ్రోకర్ల చేతుల్లోనే ఏపీ..!’.. చంద్రబాబు సర్కార్పై చింతామోహన్ నిప్పులు