Dhootha 2: అక్కినేని అభిమానులతో పాటు సౌత్ సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇండియాలోనే అతిపెద్ద సూపర్ న్యాచురల్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లలో ఒకటిగా నిలిచిన ‘దూత’ సీక్వెల్ అఫీషియల్ గా మొదలైంది. వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ కాంబోలో యువసామ్రాట్ నాగచైతన్య డిజిటల్ డెబ్యూ ఇస్తూ చేసిన ‘దూత’ సీజన్ 1 ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2023 డిసెంబర్ 1న విడుదలైన ఈ సిరీస్, అప్పట్లో సౌత్ టూ నార్త్ డిజిటల్ స్క్రీన్స్ను షేక్ చేసింది. సరిగ్గా మూడేళ్ల తర్వాత, ఇప్పుడు అంతకుమించిన పవర్ఫుల్ అండ్ డార్క్ కాన్సెప్ట్తో ‘దూత 2’ అంటూ సీక్వెల్ ని మొదలెట్టింది ఈ క్రేజీ కాంబో.
ఇక ఈ రోజు హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన పూజా కార్యక్రమాలతో ‘దూత 2’ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ క్రేజీ సీక్వెల్ ముహూర్తపు షాట్కు కింగ్ నాగార్జున క్లాప్ కొట్టడం విశేషం. తండ్రి చేతుల మీదుగా కొడుకు ప్రాజెక్ట్ ప్రారంభం కావడం అక్కినేని ఫ్యాన్స్కు ఫుల్ జోష్ ఇచ్చింది. నాగచైతన్య స్వయంగా శరత్ మరార్తో కలిసి ఈ భారీ ప్రాజెక్ట్ను నిర్మిస్తుండటం గమనార్హం.
ఫస్ట్ సీజన్లో జర్నలిస్ట్ సాగర్ పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ను చైతూ అద్భుతంగా పండించారు. 2014లో వచ్చిన ‘మనం’ సినిమాతో విక్రమ్ కుమార్ అక్కినేని ఫ్యామిలీకి ఒక క్లాసిక్ హిట్ ఇచ్చారు, ఆ తర్వాత 2022లో ‘థాంక్యూ’ సినిమా చేశారు. ఇక ‘దూత’ ఫస్ట్ సీజన్తో వీరి కాంబో సక్సెస్ రేంజ్ నెక్స్ట్ లెవెల్కు వెళ్ళింది. ఇప్పుడు వస్తున్న పార్ట్ 2 అంతకుమించిన ఇంటెన్సిటీతో, మైండ్ బెండింగ్ ట్విస్టులతో ఉండబోతోందని హింట్ ఇచ్చారు మేకర్స్.
ఇక ఈ సీక్వెల్లో కూడా టాలెంటెడ్ బ్యూటీస్ పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫస్ట్ సీజన్లో పార్వతి పోషించిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ హైలైట్గా నిలిచింది. ఈసారి సరికొత్త కథాంశంతో, మరింత భయపెట్టే ఎలిమెంట్స్తో స్క్రిప్ట్ను సిద్ధం చేశారు విక్రమ్ కుమార్. ఈ చిత్రానికి ఈషాన్ ఛాబ్రా సంగీతం అందిస్తుండగా, ముఖేష్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ సిరీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది.
నాగచైతన్య ప్రస్తుతం కేవలం డిజిటల్ లోనే కాదు, సిల్వర్ స్క్రీన్ పైనా బిజీగా ఉన్నారు. కార్తీక వర్మ దండు దర్శకత్వంలో ఆయన నటిస్తున్న పాన్ ఇండియా పీరియాడిక్ డ్రామా ‘వృష కర్మ’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇక సోషల్ మీడియాలో ‘దూత 2’ పూజా వేడుకల ఫోటోలు షేర్ చేసిన క్షణం నుంచే హ్యాష్ ట్యాగ్లు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈసారి థ్రిల్, సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ డబుల్ డోస్తో ఉంటాయని, ప్రైమ్ వీడియోలో ఇది సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూడాలి మరి భారీ అంచనాకు మోస్తున్న ఈ సీక్వెల్ ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !
also read :‘రాజా శివాజీ’ సక్సెస్ పార్టీలో రచ్చ.. నెటిజన్ల ఫైర్.. చేతులు జోడించి క్షమాపణలు కోరిన స్టార్ హీరో!