Hero Dharmendra: ముఖ్యంగా బాలీవుడ్ సినిమా ప్రస్తావన వస్తే అందులో ముఖ్యంగా గుర్తొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో హీరో ధర్మేంద్ర కూడా ఒకరు. ఒకప్పుడు ఆయన సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు అని చెప్పాలి. తన అద్భుతమైన నటనతో బాలీవుడ్ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిన నటుడు. ఈయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే థియేటర్ల దగ్గర వారం రోజుల ముందే హంగామా మొదలయ్యేది. విడుదలకు ఒక రోజు ముందు నుంచే ఆడియన్స్ కూడా టికెట్ కోసం లైన్లో నిల్చునేవారు. అంతటి క్రేజ్ దక్కించుకున్న హీరో ధర్మేంద్రపై చనిపోయారంటూ వార్తలు రావడం బాధాకరం అని చెప్పాలి.
విషయంలోకి వెళ్తే.. నవంబర్ 10వ తేదీన సాధారణ హెల్త్ చెకప్ లో భాగంగా ముంబైలోని బీచ్ క్యాండీ హాస్పిటల్ ను సందర్శించారు ధర్మేంద్ర(Dharmendra ). అయితే ఆ సమయంలోనే ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో రెండు రోజులుగా అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ఆయనను సందర్శించడానికి ఆయన భార్య హేమమాలిని (Hema Malini) కొడుకు బాబి డియోల్ (Bobby Deol) దగ్గరుండి మరీ ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి దిగ్గజ నటులు కూడా హాస్పిటల్లో సందర్శించి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు.
అయితే ఇంతలోనే ఆయన చనిపోయారు అంటూ.. ఆయన బృందం సోషల్ మీడియాలో ప్రకటించడంతో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీంతో సోషల్ మీడియాలోనే కాదు ఇటు పలు మీడియా ఛానల్స్ లో కూడా ధర్మేంద్ర చనిపోయారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అంతేకాదు ఆయన మరణానికి పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడంతో దీనిపై ఆయన కూతురు ఈషా డియోల్ మండిపడ్డారు.” మా నాన్న చనిపోలేదు బ్రతికే ఉన్నాడు” అంటూ ఆమె పోస్ట్ పెట్టగా.. ధర్మేంద్ర భార్య హేమమాలిని కూడా..” విచక్షణారహితంగా తెలియని వార్తలను ఎలా స్ప్రెడ్ చేస్తారు అంటూ మండిపడింది. తమ కుటుంబ గౌరవానికి భంగం కల్పించకూడదు” అని ఆమె ట్వీట్ చేసింది. దీంతో ధర్మేంద్ర మరణించారు అంటున్న వార్తలకు పూర్తిగా పులిస్టాప్ పడింది అని చెప్పవచ్చు.
ALSO READ:Bigg Boss 9 Promo: బిగ్ బాస్ మరో టాస్క్.. మరీ అంత ఆటిట్యూడ్ ఎందుకు?
ఇకపోతే ధర్మేంద్ర మరణించారు అంటూ వస్తున్న వార్తలు ఇదేం తొలిసారి కాదు. గతంలో 2022 జూన్ 22న ధర్మేంద్ర చనిపోయాడు అంటూ సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులే వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ వార్తలను ఖండించడానికి ఆయన మొదటి భార్య కొడుకులిద్దరూ బాబి డియోల్, సన్నీడియోల్ రంగంలోకి దిగి మరీ తన తండ్రిపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు. ఇప్పుడు మళ్లీ ఇలాంటి వార్తలే వెలువడడంతో రెండవ భార్య, ఆమె కూతురు సోషల్ మీడియాపై మండిపడ్డారు. ఏది ఏమైనా బ్రతికున్న వ్యక్తి గురించి ఇలాంటి వార్తలు వెలువడడం చాలా బాధాకరం అంటూ తమ బాధను వ్యక్తపరిచారు కుటుంబ సభ్యులు.