Geetha Singh:సినీ పరిశ్రమ అంటే బయటకి కనిపించేంత గ్లామర్ లోపల ఉండదు. ఇక్కడ అవకాశాలు రావడం ఎంత కష్టమో, వచ్చిన అవకాశాన్ని కాపాడుకోవడం అంతకంటే కష్టం. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న కమెడియన్ గీతా సింగ్, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. స్టార్ డైరెక్టర్ల వల్ల తాను మానసిక వేదనకు గురయ్యానని, సెట్స్కి వెళ్ళాక కూడా అవమానపడాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
గీతా సింగ్ తన ఇంటర్వ్యూలో దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణని ఎంతో గౌరవంగా గుర్తు చేసుకున్నారు. ఆయన సినిమాలో చిన్న పాత్ర అయినా సరే, కనీసం 50 నుండి 60 మంది ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చేవారని చెప్పారు. ఎవరైనా నటులు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే, వారికి ఏదో ఒక పాత్ర ఇచ్చి ఆదుకునే గుణం ఆయనదని కొనియాడారు. “ఆయన లాంటి దర్శకులు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ లేరు” అని చెబుతూ, నేటి కాలంలో ఆర్టిస్టుల పట్ల సానుభూతి తగ్గిపోయిందని ఆమె వాపోయారు.
ఇక స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ సినిమాలో గీతా సింగ్కు ఒక మంచి పాత్ర ఇస్తామని పిలిచారట. తీరా షూటింగ్ కోసం సెట్స్కి వెళ్ళిన తర్వాత, తన పాత్రను వేరే వాళ్ళతో చేయిస్తున్నారని తెలిసి ఆమె షాక్ అయ్యారు. “ఒక పాత్ర ఇస్తామని చెప్పి, సెట్స్ వరకు తీసుకెళ్లి, అక్కడ వేరే వాళ్ళని చూశాక కలిగే బాధ వర్ణనాతీతం” అని ఆమె ఆవేదన చెందారు. ఆ అవమానం భరించలేక అక్కడి నుండి కన్నీళ్లతో వెనక్కి వచ్చేశానని ఆమె చెప్పుకొచ్చారు.
మరో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విషయంలో కూడా తనకు చేదు అనుభవం ఎదురైందని గీతా సింగ్ తెలిపారు. రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమా కోసం తనను సంప్రదించి, సుమారు నెల రోజుల పాటు డేట్స్ బ్లాక్ చేయించుకున్నారట. ఆ సినిమా కోసం ఆమె ఇతర అవకాశాలను కూడా వదులుకున్నారు. కానీ షూటింగ్ మొదలయ్యాక చెప్తారేమో అని ఎదురు చుస్తే,అప్పుడు చెప్పలేదు ఇక చివరిగా సినిమా కు వెళ్లి చుస్తే అక్కడ వేరే అమ్మాయిని తీసుకున్నారు.ఇక దీని గురించి అనిల్ రావిపూడిని అడిగితే, ‘నాకు తెలియదు, ఆఫీస్ వాళ్ళు చేశారేమో’ అని సింపుల్ గా సమాధానం ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.
ALSO READ:Geetha Singh: మోహన్ బాబు యూనివర్సిటీపై ట్రోల్స్.. అసలు నిజం బయటపెట్టిన గీతా సింగ్!
రంగంలో టాలెంట్ ఉన్నా, సీనియారిటీ ఉన్నా కొన్నిసార్లు ఇలాంటి అవమానాలు తప్పవని గీతా సింగ్ మాటల ద్వారా అర్థమవుతోంది. ఒక నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాక కూడా, ఇలాంటి పరిస్థితులు ఎదురవడం నిజంగా బాధాకరం. సినిమా అంటే కేవలం నటన మాత్రమే కాదు, తోటి కళాకారుల పట్ల కనీస గౌరవం ఉండాలని ఆమె ఆకాంక్షించారు. గీతా సింగ్ పంచుకున్న ఈ నిజాలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.