The Raja Saab: ఈసారి సంక్రాంతి సీజన్లో తెలుగు సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద హీరోల సినిమాలు వరుసగా విడుదలవుతుండటంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఈ సంక్రాంతికి ముందుగా విడుదలైన తొలి పెద్ద సినిమా ది రాజా సాబ్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం.. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడగా.. రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. కొంతమంది ప్రేక్షకులకు సినిమా నచ్చగా.. మరికొందరికి కథ, ట్రీట్మెంట్ ఆశించిన స్థాయిలో లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే సినిమా కంటెంట్ కంటే ఎక్కువగా చర్చకు వచ్చిన విషయం టికెట్ల ధరల పెంపు. నిన్నటినుంచి ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. ఇక ఇపుడు..రాజాసాబ్ సినిమా టికెట్ల ధరలను నిబంధనలకు విరుద్ధంగా పెంచారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.
పిటీషనర్ తరఫున న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇవ్వడంలో ప్రభుత్వం నిబంధనలను పాటించడం లేదని ఆయన పేర్కొన్నారు. హోంశాఖ కార్యదర్శికి టికెట్ల ధరల పెంపుపై.. మెమో జారీ చేసే అధికారం లేదని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు
. హైదరాబాద్లో సీపీ మాత్రమే టికెట్ల ధరల పెంపు మరియు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని న్యాయవాది తెలిపారు.
అంతేకాదు..అక్రమంగా మెమో జారీ చేసిన అధికారికి రూ.5 లక్షల జరిమానా విధించాలని కోర్టును కోరారు. దీనిపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారు?” అంటూ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. టికెట్ల ధరలు పెంచవద్దని సంబంధిత మంత్రి ఇప్పటికే ప్రకటించారని కోర్టు గుర్తు చేసింది. అలాంటప్పుడు సినిమాలకు టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇస్తూ మెమోలు ఎందుకు జారీ అవుతున్నాయన్నది అర్థం కావడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
సంక్రాంతి సినిమాల సందడి మధ్య టికెట్ల ధరల వివాదం ఇండస్ట్రీలో..ప్రేక్షకుల్లో పెద్ద చర్చకు దారితీసింది. రానున్న రోజుల్లో కోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.