Pawan Kalyan:తెలుగు అభిమానుల ఫేవరెట్ స్టార్ హీరోగా ప్రత్యేకమైన పేరును సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అద్భుతమైన మేనరిజంతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే చిన్నపిల్లలను మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎంతో ఆసక్తిగా చూస్తారు. అలాంటి పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా తనకు మంచి లైఫ్ ను ఇచ్చిన ప్రజలకు ఏదైనా చేయాలి అనే ఒక సంకల్పంతో రాజకీయాలలోకి అడుగుపెట్టారు. దాదాపు పది సంవత్సరాల పోరాటం తర్వాత ఎట్టకేలకు 2024 సార్వత్రిక ఎన్నికలలో అధికారంలోకి వచ్చి తన కలను నెరవేర్చుకోవడానికి పునాదులు వేసుకున్నారు.
అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి.. ప్రజల మేలు కోసం ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ.. అందరికీ అండగా నిలుస్తున్నారు. అవసరమైన వారికి ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్న విషయం తెలిసిందే.. అధికారాన్ని ఉపయోగిస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తూ గొప్ప మనసున్న అధికారిగా పేరు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత మళ్లీ అభిమానులు ఎక్కడ తనను మిస్ అవుతారేమో అనే ఆలోచనతో అటు సినిమాలు కూడా చేస్తూ వస్తున్నారు. సాధారణంగా రెండు పడవల మీద ప్రయాణం ఎంత కఠినంగా ఉంటుందో అనుభవించే వాళ్లకే తెలుస్తుంది. అలా పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయాలు అంటూ ఏకకాలంలో ఇటు ప్రజలను అటు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన సినిమాలు తీసుకొచ్చిన ఫలితాలను చూస్తే మాత్రం అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారనే కామెంట్లు ఇప్పుడు వెలువడుతున్నాయి. ముఖ్యంగా రాజకీయాలలోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చేసిన సినిమాలకు వచ్చిన నష్టం చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేయక మానదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన చిత్రం హరిహర వీరమల్లు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను మాత్రమే ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద సుమారుగా 70 కోట్ల వరకు నష్టం వాటిల్లింది.
ALSO READ:Peddi Movie: వాయిదాలతో విసుగు తెప్పిస్తున్న పెద్ది.. చెర్రీ మాట అసత్యమేనా?
ఇకపోతే ఈ ఏడాది హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేశారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాతో గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ చేస్తారని అందరూ అనుకున్నారు కూడా.. పైగా పవన్ కళ్యాణ్ ను ఒక రేంజ్ లో చూపిస్తానని డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా వాగ్దానం చేశారు. కానీ అవేవీ బాక్సాఫీస్ వద్ద వర్క్ అవుట్ కాలేదు. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏకంగా 80 కోట్ల నష్టాన్ని మిగిల్చి అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇకపోతే అధికారంలోకి రాకముందు పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత చేసిన సినిమాలు.. వాటి ఫలితాల విషయానికి వస్తే.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా 50 కోట్ల నష్టాన్ని మిగిలిస్తే , కాటమరాయుడు సినిమా 30 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. అజ్ఞాతవాసి 60 కోట్లు, వకీల్ సాబ్ 15 కోట్లు, భీమ్లా నాయక్ 15 కోట్లు, బ్రో సినిమా 45 కోట్ల నష్టాన్ని మిగిల్చింది..ఇలా వీటిని చూస్తుంటే పవన్ కళ్యాణ్ కు రాజకీయ ఎంట్రీ తర్వాత సినిమాలు కలిసి రావడం లేదా అనే కామెంట్లు నెటిజన్స్ నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మళ్లీ గట్టి కం బ్యాక్ ఇవ్వాలి అని సురేందర్ రెడ్డి సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.