NTR:ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల ప్రమేయం లేకపోయినా.. వారిని ఇన్వాల్వ్ చేస్తూ ఏదో ఒక విషయాన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారని, అందుకోసం ఊరు వాడ ఒక కార్యక్రమం పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి.. ఈనెల 18వ తేదీన తిరుపతిలో భారీ ఎత్తున మీటింగ్ జరగబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసినా ఇదే వార్త వినిపిస్తుండడంతో తాజాగా ఈ వార్తలపై జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం వివరణ ఇచ్చింది.
ఈ మేరకు ఒక సుదీర్ఘ పోస్ట్ కూడా పంచుకుంది. “RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థ, శ్రీ ఎన్టీఆర్ గారితో సంబంధం ఉన్నట్టుగా ప్రజలలో భావన కలిగించే విధంగా వ్యవహరిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేయదలుచుకున్నది ఏమనగా, శ్రీ ఎన్టీఆర్ గారికి గానీ, ఆయన కార్యాలయానికి గానీ, RAW NTR అనే సంస్థతో లేదా దాని కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదు. ఆ సంస్థకు శ్రీ ఎన్టీఆర్ గారి తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. అలాగే ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారమూ లేదు.
శ్రీ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికారిక ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల గురించి సమాచారం శ్రీ ఎన్టీఆర్ గారు లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడించబడుతుంది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థల ద్వారా ప్రచారం చేయబడే సమాచారం , ప్రకటనలు లేదా కార్యక్రమాలను అధికారికమైనవిగా లేదా విశ్వసనీయమైనవిగా పరిగణించవద్దని మనవి.
ALSO READ:అభిమానులకు షాక్.. ఇండస్ట్రీకి దూరం కానున్న రణ్వీర్ సింగ్!
ఈ అంశంపై ఇదే మా తరఫున తుది వివరణ. దీనితో ఈ విషయానికి సంబంధించిన అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు పూర్తిగా ముగింపు పలుకుతాయని ఆశిస్తున్నాము. అలాగే, సంప్రదాయ మీడియా, డిజిటల్ మరియు సోషల్ మీడియా వేదికలు, అలాగే శ్రీ ఎన్టీఆర్ గారి అభిమానులు, శ్రేయోభిలాషులు ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా, అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్ని విశ్వసించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మీ సహకారానికి, అలాగే శ్రీ ఎన్టీఆర్ గారిపై మీరు చూపుతున్న నిరంతర అభిమానానికి, మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికైనా అధికారికం కాని వాటిని విస్తృతంగా ప్రచారం చేయవద్దు అంటూ అభిమానులు కూడా కోరుకుంటున్నారు.