ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీకి వినతులు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వర్గాలతో చర్చలు , సంప్రదింపులు జరుపుతున్న కేకే కమిటీ సభ్యులు వారిచ్చిన సలహాలు, సూచనలను నోట్ చేసుకుంటున్నారు. వాటన్నింటినీ ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఈనెల 22 వరకు చర్చలు కొనసాగనున్నాయి. ఓయూ స్టూడెంట్స్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. వివిధ కేటగిరీలుగా ఉద్యమకారులను గుర్తించే అంశాలను ఇప్పటికే కూలంకషంగా చర్చించారు.
దీనిపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చారు.పేరుకు కేకే కమిటీ అయినా..మొత్తం ఎమ్మెల్సీ కోదండరామ్ సెంట్రిక్గా ఈ సమావేశాలు నడుస్తున్నాయి. చర్చలు, సంప్రదింపులు.. సలహాలు, సూచనలు అన్నీ ఆయనే నోట్ చేసకుంటున్నారు. కేకే, పొన్నం ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నా.. కోదండరామ్, రాములు నాయక్, మోతె శోభన్రెడ్డిలు సమావేశాలకు పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. కోదండరామ్ కూడా గతంలో జిల్లాల వారీగా కొనసాగిన టీజాక్ సభ్యులను యాక్టివ్ చేస్తున్నారు. వారందరినీ మీటింగులకు ఆహ్వానిస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు వచ్చిన ప్రధాన డిమాండ్లలో కేబీఆర్ పార్క్ పేరు మార్చాలని, ఉద్యమకారులు చనిపోతే .. వారి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేయించాలనే వినతులు చాలా మంది నుంచి వచ్చినట్టుగా తెలిసింది. కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ పేరును మార్చాలని ఉద్యమ సమయం నుంచి ప్రధాన డిమాండ్గా ఉంది. అయితే తెలంగాణ వచ్చిన తరువాత దీని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ కేకే కమిటీలో దీన్ని లేవనెత్తారు.
ఈ పేరును మార్చి అంబేద్కర్ పేరును పెట్టాలని కొందరు.. తెలంగాణ వైతాళికుల పేర్లు ఎవరివి పెట్టినా తమకు అభ్యంతరం లేదని మరికొందరు కమిటీకి సూచించినట్టు తెలిసింది. ప్రభుత్వం ఇచ్చే 250 గజాల స్థలం జిల్లాల్లో వద్దని, ఫ్యూచర్ సిటీలో కావాలని, ప్రభుత్వ స్థలంతో పాటు రెండు ఎకరాల భూమి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిగిలనవన్నీ రెగ్యులర్గా చర్చకు వచ్చిన డిమాండ్లు, సలహాలే ఉన్నాయి.
కార్పొరేట్ విద్యలో యాభై శాతం సబ్సిడీ, కోటి రూపాయల ఇన్సురెన్సు, గుర్తింపు కార్డులు, ఫ్రీ బస్సు ఫెసిలిటీ, ఉద్యమకారుల పేర్లను, వారి అడ్రస్లతో సహా పుస్తకాలను ముద్రించాలనే డిమాండ్ కూడా వచ్చింది. వీటన్నింటినీ కోదండరామ్ నేతృత్వంలోని కమిటీ సేకరించింది. దాదాపుగా ఈనెలాఖరు వరకు చర్చలు ముగియనున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చింది కమిటీ. కోదండరామ్ కు ఉద్యమకారుల డిమాండ్లు ఆది నుంచి తెలుసు కాబట్టి.. ఇదింకా సులువవుతోంది. ప్రభుత్వానికి, ఉద్యమకారులకు మధ్య వారధిగా ఆయన ఉన్నారు. దీంతో ఉద్యమకారులకు కూడా నమ్మకం పెరిగింది. తమ డిమాండ్లు నెరవేయడమే కాకుండా.. తమకు తగిన గుర్తింపు రేవంత్ ప్రభుత్వంలో దొరకుతుందని అంతా భావిస్తున్నారు.