Kajal Aggarwal: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న అకృత్యాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ముఖ్యంగా దీపు చంద్రదాస్ అనే హిందూ కార్మికుడిని అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటనపై సోషల్ మీడియా వేదికగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన గళాన్ని వినిపించారు.
కాజల్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలను షేర్ చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఒక బలమైన పిలుపునిచ్చారు. “హిందువులారా మేల్కోండి.. మౌనం మిమ్మల్ని రక్షించదు. బంగ్లాదేశ్లో హిందువులను కాపాడండి” అని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు, #AllEyesOnBangladeshHindus అనే హ్యాష్ట్యాగ్తో ఈ సమస్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే దీపు చంద్రదాస్ను మతం పేరుతో సాకు చూపి ప్రాణాలు తీసిన తీరును ఆమె ఎండగట్టారు.
పవన్ కళ్యాణ్ బాటలో కాజల్..
బంగ్లాదేశ్ ఘటనలపై ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాజల్ వంటి స్టార్ హీరోయిన్ కూడా బాధితుల పక్షాన నిలబడటంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సామాజిక అంశాలపై తక్కువగా స్పందించే సినిమా సెలబ్రిటీలు, ఇలాంటి సున్నితమైన అంశంపై ధైర్యంగా స్పందించడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాజల్ అగర్వాల్ ప్రస్థానం
చందమామ, మగధీర వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కాజల్, కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతను కూడా చాటుకున్నారు. 2004లో హిందీ చిత్రం ‘క్యున్ హో గయా నా’తో కెరీర్ ప్రారంభించిన ఆమె, ‘లక్ష్మీ కళ్యాణం’తో టాలీవుడ్లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్లోనూ బిజీగా ఉన్న ఈమె, బంగ్లాదేశ్ హిందువుల కోసం గొంతు ఎత్తడం సంచలనంగా మారింది.