Mark OTT: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా మార్క్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో గత ఏడాది చివర్లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సినిమాను విజయ్ కార్తికేయ రచన, దర్శకత్వం వహించారు. సుదీప్.. విజయ్ కార్తికేయ కలయికలో ఇది రెండో సినిమా కావడం విశేషం. వీరి కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమా కూడా మంచి స్పందన పొందింది.
మార్క్ సినిమా 2025 డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. యాక్షన్, థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఒకే రోజు జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఇందులో అజయ్ మార్కండేయ అనే సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కిచ్చా సుదీప్ కనిపిస్తారు. కర్ణాటక రాష్ట్రంలో అకస్మాత్తుగా పెరిగిన హింసాత్మక ఘటనలు అతన్ని మళ్లీ డ్యూటీలోకి తీసుకువస్తాయి.
ఈ కేసుల విచారణలోకి వెళ్లిన అజయ్, ఒకదానితో ఒకటి సంబంధం లేని నేరాలు ఎలా కలుస్తాయో తెలుసుకుంటాడు. మిస్సింగ్ పిల్లలు, గ్యాంగ్ క్రైమ్, రాజకీయ సమస్యలు ఇలా అనేక అంశాలు కథలో భాగమవుతాయి. అదే సమయంలో అతని వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా అతని ప్రయాణాన్ని మరింత కష్టతరం చేస్తాయి. వ్యవస్థలో ఉన్న లోపాలు, లోపలి శత్రువులతో కూడా అతడు పోరాడాల్సి వస్తుంది.
ఈ సినిమాలో నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో, విక్రాంత్, రోష్ని ప్రకాష్, గురు సోమసుందరం, యోగి బాబు, గోపాలకృష్ణ దేశ్పాండే, నిశ్విక నాయుడు వంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిల్మ్స్ మరియు కిచ్చా క్రియేషన్స్ కలిసి నిర్మించాయి. సినిమాను టీ.జి. త్యాగరాజన్ సమర్పించారు.
టెక్నికల్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీని శేఖర్ చంద్ర నిర్వహించారు. సంగీతాన్ని అజనీష్ బి. లోకనాథ్ అందించారు. యాక్షన్ సన్నివేశాలు స్టంట్ సిల్వా, సుప్రీమ్ సుందర్, రవి వర్మల పర్యవేక్షణలో తెరకెక్కాయి.
ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే..మార్క్ సినిమా జనవరి 23, 2026 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది.
థియేటర్లో మిస్ అయినవారు ఇప్పుడు ఇంట్లో కూర్చునే ఈ యాక్షన్ థ్రిల్లర్ను ఆస్వాదించవచ్చు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. సుదీప్ అభిమానులు మాత్రం ఇప్పటికే ఈ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ALSO READ: Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమాకు క్రేజీ టైటిల్..వీడు మళ్ళీ మొదలెట్టాడురా బాబు!