Mr. Work From Home: భీమిలి ప్రాంతంలో సినిమా సందడి నెలకొంది. శనివారం భీమిలి తిమ్మాపురంలో ఉన్న విశాఖ ఫిల్మ్ నగర్ సెంటర్లో మిస్టర్ వర్క్ ఫ్రం హోమ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినిమా బృందం మొత్తం హాజరై సందడి చేసింది. స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ వేడుకను ఆసక్తిగా తిలకించారు.
ఈ చిత్రాన్ని అరవింద్ నిర్మిస్తున్నారు. మధు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. త్రిగున్ హీరోగా నటించగా, పాలయి రాధా కృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మధు మాట్లాడుతూ, ఈ సినిమా కథ వ్యవసాయ నేపథ్యంలో సాగుతుందని తెలిపారు. వ్యవసాయంలో కొత్త యంత్రాలు, ఆధునిక పరికరాల వినియోగం ఎలా రైతులకు ఉపయోగపడుతుందో ఈ సినిమాలో చూపించామని చెప్పారు. గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన ఒక యువకుడు, యువతి మధ్య ప్రేమ, పెళ్లి, కుటుంబ జీవితం చుట్టూ కథ తిరుగుతుందని వివరించారు. వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఈ చిత్రంలో ఉంటుందని అన్నారు.

హీరో త్రిగున్ మాట్లాడుతూ, ఈ సినిమా నేటి యువతకు చాలా అవసరమని చెప్పారు. వ్యవసాయం పట్ల యువతలో ఆసక్తి పెరగాలనే ఉద్దేశంతో ఈ సినిమా రూపొందించామని తెలిపారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే సందేశం ఈ చిత్రంలో ఉంటుందని ఆయన అన్నారు. ఈ సినిమాలో నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని..ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
నిర్మాత అరవింద్ మాట్లాడుతూ..ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందేలా ఉంటుందని అన్నారు. దర్శకుడు మధు ఎంతో కష్టపడి సినిమాను తీశారని, మంచి కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు. కుటుంబంతో కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుందని తెలిపారు.
ఈ ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర బృందం సభ్యులు పాల్గొని మాట్లాడారు. మిస్టర్ వర్క్ ఫ్రం హోమ్ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంతో వినోదం, సందేశం కలగలిసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది.
ALSO READ: Vishwak Sen: అనిల్ రావిపూడికి చిరు కారు గిఫ్ట్.. హర్టయిన మాస్ కా దాస్!