Nuvve Kavali:కొన్ని కొన్ని చిత్రాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి అనడంలో సందేహం లేదు. అలాంటి చిత్రాలలో నువ్వే కావాలి చిత్రం కూడా ఒకటి. కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలిచిపోయిన ఈ సినిమా వచ్చి.. ఈ ఏడాదికి 25 వసంతాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
తరుణ్ హీరోగా, రిచా హీరోయిన్ గా.. త్రివిక్రమ్ రచయితగా తెరకెక్కిన ఈ సినిమా 2000 సంవత్సరం అక్టోబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా విడుదలయి నేటికీ 25 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ సినిమా సృష్టించిన రికార్డ్స్ ఏంటో కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం.
తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన నిరం అనే సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఎన్నో మార్పులు చేసి విడుదల చేయగా ఒరిజినల్ కంటే తెలుగులోనే భారీ సక్సెస్ ను అందుకుంది ఈ సినిమా.
మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. అటు వసూళ్ల వర్షం కూడా కురిపించింది. 20 సెంటర్లలో 200 రోజులు, 6 సెంటర్లలో 365 రోజులు, మరికొన్ని సెంటర్లలో 400 రోజులు ఆడి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
కేవలం 1.3కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 24 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
నువ్వే కావాలి సినిమాకి ముందుగా హీరోగా మహేష్ బాబును అనుకున్నారట. కానీ మహేష్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లభించకపోవడంతో సుమంత్ ని తీసుకోవాలనుకున్నారు. అయితే సుమంత్ ఆ సమయంలో బిజీగా ఉండడంతో బాలీవుడ్ హీరోతో సినిమా చేద్దామనుకొని ఆఖరికి హీరోగా తరుణ్ ను ఎంపిక చేశారు.
ఇక్కడ మరో విశేషమేమిటంటే.. తరుణ్ కి ఇదే తొలి చిత్రం కావడం గమనార్హం. అప్పటివరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు 30 చిత్రాలలో నటించారు.
ఇకపోతే ఈ సినిమా కలెక్షన్లతోపాటు అవార్డులు కూడా అందుకుంది. 2000 సంవత్సరంలో ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో జాతీయ పురస్కారాన్ని అందుకుంది. అలాగే ఉత్తమ నటుడు కేటగిరీలో తరుణ్, ఉత్తమ నటి కేటగిరీలో రిచా పల్లోడ్, ఉత్తమ దర్శకుడు కె విజయభాస్కర్, ఉత్తమ రచయిత త్రివిక్రమ్, ఉత్తమ సంగీత దర్శకుడు కోటీ కి నంది అవార్డులు లభించాయి.
ఇక ఇదే చిత్రాన్ని అటు హిందీలో కూడా రిలీజ్ చేశారు తుజే మేరీ కసం అనే పేరుతో రీమేక్ అయిన ఈ సినిమా అటు హిందీలో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో రితేష్, జెనీలియా జంటగా నటించారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే వీళ్లిద్దరూ నిజజీవితంలో భార్యాభర్తలు గా మారడం విశేషం.
ఇకపోతే ఇన్ని రికార్డులు సృష్టించిన ఈ సినిమా.. వచ్చి 25 ఏళ్లవుతున్నా.. ఇప్పటికీ ఈటీవీలో ప్రసారమైతే చాలు ఇంకా ఈ సినిమా చూసే ప్రేక్షకులు ఉన్నారు అనడంలో సందేహం లేదు.
also read:Devara: దేవరకు గ్రహణం వీడింది.. ఎట్టకేలకు టీవీల్లోకి!