Pahlaj Nihalani Death: బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ సీనియర్ నిర్మాత, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మాజీ చైర్మన్ పహ్లాజ్ నిహలానీ (80) గురువారం కన్నుమూశారు. గత కొన్ని నెలలు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
Read also-‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?
గత నాలుగు నెలలుగా ‘లివర్ సిరోసిస్’ సమస్యతో బాధపడుతున్న పహ్లాజ్ నిహలానీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇటీవల ఆసుపత్రిలో చేరారు. మెరుగైన వైద్యం కోసం గత 30 రోజుల్లో ఆయనను వివిధ ఆసుపత్రులకు తరలించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ జయంత్ బార్వే పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందించారు. నిహలానీ త్వరలోనే కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారని బుధవారం నాడే ఆయన భార్య ఆశాభావం వ్యక్తం చేశారు, కానీ ఇంతలోనే ఆయన మరణవార్త వినాల్సి రావడం పట్ల సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.
పహ్లాజ్ నిహలానీ కేవలం నిర్మాతగానే కాకుండా చిత్ర పరిశ్రమకు సంబంధించిన విభిన్న సంఘాలలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ‘అసోసియేషన్ ఆఫ్ పిక్చర్స్ అండ్ టీవీ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్’ సంస్థకు ఆయన దాదాపు మూడు దశాబ్దాల పాటు అధ్యక్షుడిగా సేవలందించి, 2009లో ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత జనవరి 2015లో కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశీయ చలనచిత్ర సెన్సార్ బోర్డు (CBFC) చైర్మన్గా నియమించింది. ఆయన పదవీకాలంలో సినిమాల్లోని కంటెంట్, డైలాగ్లపై కఠినమైన ఆంక్షలు విధించడం, కత్తెర్లు వేయడం ద్వారా బాలీవుడ్లో పెద్ద ఎత్తున వివాదాలు రేగాయి. ముఖ్యంగా ‘ఉడ్తా పంజాబ్’ వంటి చిత్రాల విషయంలో నిహలానీ తీసుకున్న నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 11, 2017న ఆయనను చైర్మన్ పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో ప్రముఖ గీత రచయిత ప్రసూన్ జోషిని ప్రభుత్వం నియమించింది.
Read also-ప్రకాష్ రాజ్కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..
పహ్లాజ్ నిహలానీ నిర్మాతగా వ్యవహరించిన చివరి చిత్రం ‘రంగీలా రాజా’ 2019లో విడుదలైంది. రజనీకాంత్ నటించిన తమిళ సూపర్ హిట్ ‘నెట్రికన్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా తన ఆప్తమిత్రుడు గోవిందాకు ఒక భారీ కమ్బ్యాక్ ఇవ్వాలని నిహలానీ భావించారు. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. పహ్లాజ్ నిహలానీ మరణం పట్ల బాలీవుడ్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు ప్రముఖ నటులు, దర్శకులు, నిర్మాతలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. కొత్త నటీనటులకు, సాంకేతిక నిపుణులకు లైఫ్ ఇచ్చిన ఒక గొప్ప నిర్మాతను బాలీవుడ్ కోల్పోయిందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.