Pankaj Tripathi Brother: ప్రముఖ బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడు బిజేంద్ర నాథ్ తివారీపై బీహార్లో మారణాయుధాలతో ఘోర దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Read also-మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ మైథలాజికల్ మూవీకి పాతికేళ్లు.. అప్పుడే ఆ రూల్ బ్రేక్…
పోలీసుల కథనం ప్రకారం.. పాత కక్షల నేపథ్యంలో బిజేంద్ర నాథ్ తివారీపై కొందరు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను పాట్నాలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, నిందితులను పట్టుకోవడానికి ముమ్మరంగా దాడులు (రైడ్స్) నిర్వహిస్తున్నారు.
‘నవభారత్ టైమ్స్’ నివేదిక ప్రకారం.. మాధోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్సంద్ గ్రామంలో ఈ ఘోర దాడి జరిగింది. బిజేంద్ర నాథ్ తివారీతో ఉన్న ‘దీర్ఘకాలిక శత్రుత్వం’ వల్లే దుండగులు ఆయనను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
గ్రామంలో మాటు వేసిన దాడికోరులు, ఆయన రాగానే ఒక్కసారిగా మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో బిజేంద్ర తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను అత్యవసర చికిత్స కోసం మోడల్ సదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, ఆయన పరిస్థితి ‘అత్యంత విషమంగా’ ఉందని వెల్లడించారు.
దాంతో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఆయనను పాట్నా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం అక్కడ ఆయనకు చికిత్స అందుతోంది. మరోవైపు, ఈ దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి, వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు.