Pawan Kalyan Naxalism: సమాజంలో జరిగే అన్యాయాలపై పోరాడే క్రమంలో ఒకప్పుడు తాను నక్సలిజం వైపు ఆకర్షితుడనయ్యానని, చేతిలోకి తుపాకీ తీసుకోవాలనే బలమైన ఆలోచన కూడా తనకు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన విషయాలను పంచుకున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, తన టీనేజ్ రోజుల్లోని అంతర్గత సంఘర్షణలను మొదటిసారి బహిర్గతం చేశారు.
తన 17 నుంచి 21 సంవత్సరాల వయసులో (టీనేజ్ రోజుల్లో) సమాజంలోని అసమానతలు, అణచివేత, ప్రభుత్వాల బుజ్జగింపు రాజకీయాలపై తీవ్రమైన ఆగ్రహం ఉండేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. “ఆ రోజుల్లో నాలో ఒక రకమైన దిశాలేని కోపం ఉండేది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు ఎక్కడో ఒకచోట సమాధానం వెతకాలని ఆరాటపడేవాడిని. ఎర్రజెండా పట్టుకుని తిరిగే నక్సలైట్లను చూసినప్పుడు, వీళ్లకు చాలా ధైర్యం ఉందనే భావన కలిగి వారి వైపు ఆకర్షితుడినయ్యాను. ఆ ఉద్వేగంలో నక్సలైట్లలో చేరి, తుపాకీ పట్టాలని కూడా బలంగా అనుకున్నాను” అని పవన్ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
నాటి సమాజంపై పవన్లో ఉన్న ఆ తీవ్రమైన అసంతృప్తిని, ఆవేశాన్ని ఆయన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి సకాలంలో గమనించారు. పవన్ తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా, ఆ ఆవేశాన్ని ఒక సృజనాత్మక శక్తిగా ఎలా మార్చాలో చిరంజీవి చక్కగా గైడ్ చేశారు. కుటుంబ బాధ్యతలను గుర్తుచేస్తూ… “నీ జీతం లేదా కష్టార్జితం మీద ఆధారపడి నీ కుటుంబం ఉంటే, అప్పుడు కూడా నువ్వు ఇదే నిర్ణయం తీసుకుంటావా?” అని చిరంజీవి అడిగిన ఒక్క ప్రశ్న పవన్ను తీవ్రంగా ఆలోచింపజేసింది. ఆ తర్వాత పవన్ను బలవంతంగా సినిమా ఇండస్ట్రీ వైపు, మార్షల్ ఆర్ట్స్ వైపు మళ్లించి, ఆ కోపాన్ని మరింత నిర్మాణాత్మకమైన రంగంలో ఉపయోగపడేలా చిరంజీవి మార్గదర్శకత్వం వహించారని పవన్ కళ్యాణ్ కృతజ్ఞతతో చాటుకున్నారు.
ఆ తర్వాతే తన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైందని, చివరికి సినిమాల్లో అత్యున్నత స్టార్డమ్ను చూసినప్పటికీ నాటి సామాజిక కోపమే తనను రాజకీయాల వైపు నడిపించిందని పవన్ స్పష్టం చేశారు. నాడు తుపాకీ పట్టి సాధించాలనుకున్న మార్పు కంటే, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల్లో ఉంటూ మార్పు తీసుకురావడమే సరైన మార్గమని నమ్మి జనసేన పార్టీని స్థాపించినట్లు ఆయన ఈ ఇంటర్వ్యూ ద్వారా వివరించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు సినీ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కోట్లాది మంది అభిమానించే ఒక స్టార్ హీరో, ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరడం వెనుక ఇంతటి సుదీర్ఘ అంతర్మథనం ఉందా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.