Peddi Fever: రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలై సంచలనం సృష్టిస్తోంది. జూన్ 3న జరిగిన ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమా హవా మొదలైంది. మొదటి రోజే మెగా అభిమానులు థియేటర్లను జాతరను తలపించేలా మార్చేశారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వీడియో వైరల్గా మారింది.
థియేటర్లో సినిమా ప్రదర్శితమవుతుండగా, ఒక మహిళా అభిమాని స్క్రీన్ ముందుకు వచ్చి ‘రైరై రారా’ అంటూ సాగే హై-ఎనర్జీ సాంగ్కు పూనకాలు వచ్చినట్లు ఊరమాస్ స్టెప్పులతో రచ్చ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో, ఆమె డ్యాన్స్ నైపుణ్యానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. నిజమైన సినిమా పిచ్చి అంటే ఇదేనంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
సినిమాపై ముందే భారీ హైప్
నిజానికి ఈ సినిమా థియేటర్ ఎంట్రీ అంత ఈజీగా కాలేదండోయ్. షూటింగ్ టైమ్ లో ఎదురైన కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ చిత్రం రెండుసార్లు వాయిదా పడాల్సి వచ్చింది. అయితే, యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా రేసు నుంచి తప్పుకోవడంతో, మేకర్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా జూన్ 4వ తేదీని పక్కాగా లాక్ చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పైగా ఉప్పెన లాంటి క్లాసిక్ బ్లాక్బస్టర్తో టాలీవుడ్ను ఊపేసిన డైరెక్టర్ బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో సినిమాపై ముందే భారీ హైప్ క్రియేట్ అయింది.
ప్రత్యేక గీతంలో మెరిసిన శృతి హాసన్
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కథానాయికగా నటించి మెప్పించింది. ఎన్టీఆర్ సరసన నటించిన ‘దేవర’ చిత్రం తర్వాత తెలుగులో ఆమెకు ఇది మరో భారీ ప్రాజెక్ట్ కావడం విశేషం. అంతేకాదు, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో మెరిసి మాస్ ఆడియన్స్కు పూనకాలు తెప్పించింది. గతంలో రామ్ చరణ్ సరసన ‘ఎవడు’ సినిమాలో నటించిన శృతి, మళ్లీ ఇన్నాళ్లకు ఈ స్పెషల్ సాంగ్తో స్క్రీన్ను షేక్ చేసింది. వీరితో పాటు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించి సినిమా వెయిట్ను మరింత పెంచేశారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు థియేటర్లలో ఆడియన్స్ను కుర్చీల్లో కూర్చోనివ్వడం లేదు.
ఎన్ని రికార్డులని బద్దలు కొడుతుందో
మెగా పవర్స్టార్ కెరీర్లో మైల్స్టోన్గా నిలిచేలా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రామ్ చరణ్ నటన, బుచ్చిబాబు టేకింగ్ వేరే లెవెల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. థియేటర్లలో పేపర్ల వర్షం కురుస్తోంది, ఈలలు, గోలలతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. మొదటి రోజు వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఉత్తరాది మార్కెట్లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన ఓపెనింగ్స్ రావడం విశేషం. చూడాలి మరి మొదటి రోజు గడిచేసరికి ఈ సినిమా ఎన్ని రికార్డులని బద్దలు కొడుతుందో !
also read :సడన్గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?