Pradeep Rawat Passes Away: భారతీయ సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.మొన్నటికి మొన్న జానకి, సునీల్ ఆనంద్, జమునా రాణి,పావలా శ్యామల వంటి సినీ తారలు మృతి చెందగా తాజాగా ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు.వెండితెరపై తన పవర్ఫుల్ విలన్ పాత్రలతో ప్రేక్షకులను భయపెట్టిన ప్రదీప్ రావత్ తన 74 ఏళ్ల వయసులో మృతి చెందారు.కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఇటీవల మరింత విషమించినట్లు సమాచారం.మంగళవారం సాయంత్రం ముంబైలోని తన నివాసంలో గుండెపోటుకు గురైన ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది.ఇక ఈ వార్త బయటకు రావడంతో బాలీవుడ్, టాలీవుడ్తో పాటు ఇతర సినీ పరిశ్రమల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
ప్రదీప్ రావత్ పేరు చెప్పగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ‘గజినీ’ సినిమా. ఆ సినిమాలో ఆయన చేసిన విలన్ పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోతో సమానంగా నిలిచిన ఆ పాత్రతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఆయన ప్రయాణం అక్కడి నుంచి మొదలు కాలేదు. టెలివిజన్లో ప్రసారమైన ‘మహాభారత్’ సీరియల్లో అశ్వత్థామ పాత్రతో తన నట జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బాలీవుడ్లో ‘సర్ఫరోష్’, ‘లగాన్’ వంటి సినిమాల్లో నటిస్తూ ఒక్కో మెట్టు ఎక్కారు. అయితే ‘గజినీ’తో ఆయన కెరీర్ పూర్తిగా మారిపోయింది.
తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రదీప్ రావత్ చాలా దగ్గరయ్యారు. రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ సినిమాలో ఆయన చేసిన విలన్ పాత్ర ఇప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటి. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ఛత్రపతి’లో కూడా ఆయన నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. ‘భద్ర’, ‘లక్ష్మీ’, ‘దేశముదురు’, ‘స్టాలిన్’, ‘యోగి’, ‘జగడం’ లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన విలన్గా కనిపించారు. హీరో ఎంత బలంగా ఉంటే, అతనికి ఎదురు నిలిచే విలన్ కూడా అంతే బలంగా ఉండాలని అనుకునే దర్శకులకి ఫస్ట్ ఆప్షన్ ఆయనే.
ఆయనలో ప్రత్యేకత ఏంటంటే… పెద్దగా అరవకుండా, ఓవర్ యాక్టింగ్ చేయకుండా కేవలం తన లుక్స్, కళ్లతోనే భయపెట్టగలిగేవారు. ఆయన మాట్లాడే తీరు, డైలాగ్ చెప్పే స్టైల్, స్క్రీన్పై కనిపించే ప్రెజెన్స్ అన్నీ కలిసి ప్రతి పాత్రను ప్రత్యేకంగా మార్చేవి. అందుకే ఆయన చేసిన చాలా విలన్ పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో ఉన్నాయి.
హిందీ, తెలుగు మాత్రమే కాదు… తమిళం, కన్నడ, నేపాలీ భాషల్లో కూడా ఆయన నటించారు. చివరి వరకు సినిమాలపై అదే ఇష్టం కొనసాగించారు. ఆరోగ్యం బాగోలేకపోయినా ఇటీవల ఓ నేపాలీ సినిమా షూటింగ్ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. నటన అంటే ఆయనకు ఎంత ప్రేమ ఉందో దీన్నిబట్టి అర్థమవుతుంది.
ప్రదీప్ రావత్ మరణ వార్తను నటి రోష్ణి అచ్రేజా ధృవీకరించినట్లు జాతీయ మీడియా తెలిపింది. మొదట ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందారని, తర్వాత మరో ఆసుపత్రిలో వైద్యం కొనసాగిందని సమాచారం. సహనటుడు యశ్పాల్ శర్మ కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ, “మా గజినీ… మా దేవా ఇక లేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి” అంటూ భావోద్వేగ పోస్టు చేశారు. ఈ పోస్టు చూసిన అభిమానులు కూడా పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నారు.
also read :ఫోక్ క్వీన్ నాగదుర్గకు ఓటీటీలో అదిరిపోయే హిట్!
సినిమాల్లో హీరోలు మారుతుంటారు… కథలు మారుతుంటాయి… కానీ కొన్ని విలన్ పాత్రలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి పాత్రలకు ప్రాణం పోసిన నటుల్లో ప్రదీప్ రావత్ ఒకరు. ఆయన లేకపోయినా ‘గజినీ’, ‘సై’, ‘ఛత్రపతి’, ‘భద్ర’, ‘లగాన్’, ‘స్టాలిన్’ లాంటి సినిమాల్లో ఆయన నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. భారతీయ సినీ పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.