Rajamouli:సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. టైమ్ ట్రావెల్ అడ్వెంచర్గా వస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ సినిమా షూటింగ్, కథా నేపథ్యం గురించి పంచుకున్న మైండ్ బ్లాకింగ్ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజమౌళి తెలిపిన వివరాల ప్రకారం ‘వారణాసి’ చిత్రం షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. కీలకమైన యాక్షన్ సీక్వెన్సులు, ఎమోషనల్ సీన్లు అన్నింటినీ ఇప్పటికే చిత్రీకరించేశారు. ఇక మిగిలిన 20 శాతం చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. 2022 నుంచే ఈ కథను డెవలప్ చేస్తున్నట్లు జక్కన్న వెల్లడించారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా అలరించనున్నారు.
ALSO READ:కొడుకులతో ప్రత్యేక పూజ చేయిస్తున్న హీరో ధనుష్!
ఈ సినిమా స్టోరీ లైన్ ఏ రేంజ్లో ఉండబోతుందో రాజమౌళి రివీల్ చేశారు. ఇక కథ వారణాసిలో మొదలై అంటార్కిటికా, ఆఫ్రికా ఖండాల మీదుగా సాగుతుంది. అక్కడితో ఆగకుండా కాలంలో వెనక్కి వెళ్తూ ప్రాచీన రోమ్ సామ్రాజ్యాన్ని, రామాయణ కాలాన్ని తాకి.. చివరకు మళ్లీ వారణాసికే చేరుకుంటుంది. ఈ విజువల్ గ్రాండియర్ కోసమే చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్లో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు.
తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ గురించి స్పందిస్తూ.. కథను ముందే ఎక్కువగా రివీల్ చేయడం ఇష్టం లేకే ఆ వీడియోను ప్రత్యేకంగా డిజైన్ చేశామని జక్కన్న చెప్పారు. ఇక ప్రేక్షకులకు థియేటర్లలో ఎలాంటి అద్భుతమైన అనుభూతి దక్కబోతోందో చూపించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్, ‘ఇండియానా జోన్స్’ సినిమాల ప్రభావం తనపై ఉందన్నారు.
భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరో మెట్టు ఎక్కించేలా రాజమౌళి ఈ చిత్రాన్ని చెక్కుతున్నారు. చారిత్రక అంశాలు, ప్రపంచ పర్యటన, విజువల్స్ కలగలిపిన ఈ భారీ వండర్ 2027 ఏప్రిల్ 7న థియేటర్లలోకి రాబోతోంది. ఆ రోజున బాక్సాఫీస్ వద్ద మహేశ్-రాజమౌళి కాంబో ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.