Peddhi Business: టాలీవుడ్ బాక్సాఫీస్ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు కేవలం నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో మాత్రమే రికార్డు స్థాయి బిజినెస్ డీల్స్ వినిపించేవి. కానీ ఇప్పుడు ఆ హవా ఉత్తరాంధ్ర (వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ ఏరియా) వైపు మళ్లింది. దీనికి నిదర్శనంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైనమిక్ డైరెక్టర్ బుచ్చి బాబు సనా కలయికలో వస్తున్న ‘పెద్ది’ చిత్రం నిలుస్తోంది. సాధారణంగా ఒక అగ్ర హీరో సినిమాకు ఉత్తరాంధ్ర మార్కెట్ 12 నుండి 15 కోట్ల రూపాయల మధ్యలో ఉంటుంది. కానీ ‘పెద్ది’ చిత్రం కోసం ఏకంగా 25 కోట్ల రూపాయల రేషియోను కోట్ చేస్తుండటం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ స్థాయి బిజినెస్ డీల్స్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయ్యాయి. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగిన తర్వాత, ఆయన సినిమాపై ఉన్న అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Read also-Long Runtime: పాన్ ఇండియా సినిమాల రన్ టైమ్ పెరగడానకి కారణం ఇదే!.. ప్రేక్షకులకు ఏం కావాలంటే?
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ మార్కెట్ పరిధి కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయికి చేరింది. దీంతో ఉత్తరాంధ్ర బయ్యర్లు సైతం పోటీ పడి భారీ రేట్లకు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఉప్పెన’ చిత్రంతో సంచలనం సృష్టించిన బుచ్చి బాబు సనా, ఈసారి క్రీడా నేపథ్యం ఉన్న ఎమోషనల్ డ్రామాతో వస్తుండటం సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. చాలా కాలం తర్వాత వింటేజ్ రెహమాన్ మార్కును ఈ పాటలో వింటున్నామని అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఉత్తరాంధ్రలో 25 కోట్ల బిజినెస్ అంటే ఆ చిత్రం అక్కడ దాదాపు 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇది మామూలు విషయం కాదు. అయితే చిత్ర నిర్మాతలు మాత్రం సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ భారీ ధరను నిర్ణయించినట్లు తెలుస్తోంది. సినిమా కథా నేపథ్యం కూడా ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాలకు దగ్గరగా ఉండవచ్చనే ప్రచారం కూడా ఈ బిజినెస్కు ఊతమిస్తోంది. మొత్తానికి ‘పెద్ది’ సినిమా కేవలం పోస్టర్లు, పాటలతోనే కాకుండా, బిజినెస్ లెక్కలతో కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.