Ramayana Teaser: భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఒకటిగా భావిస్తున్న ‘రామాయణం’ సినిమాకు సంబంధించిన తొలి గ్లింప్స్ (టీజర్) ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. హనుమాన్ జయంతి సందర్భంగా అధికారికంగా విడుదల కానున్న ఈ టీజర్ను, అంతకుముందే లాస్ ఏంజిల్స్లో జరిగిన ఒక ప్రత్యేక స్క్రీనింగ్లో చూసిన ప్రముఖ సినీ విశ్లేషకులు దీనిని ఒక ‘దైవిక అనుభవం’ అని అభివర్ణిస్తున్నారు.
Read also-‘పొదరిల్లు’ గాయత్రి లవ్ స్టోరీలో ట్విస్టులు.. భర్త బ్యాగ్రౌండ్ ఇదే..?
ఈ చిత్ర టీజర్ సుమారు 2 నిమిషాల 38 సెకన్ల నిడివితో ఉందని సమాచారం. టీజర్ను చూసిన వారు ఇందులోని విజువల్స్ మరియు వీఎఫ్ఎక్స్ (VFX) పనితీరును చూసి ఆశ్చర్యపోతున్నారు. హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా, భారతీయ ఇతిహాసాన్ని వెండితెరపై అత్యంత వైభవంగా ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అత్యంత సహజంగా, అద్భుతంగా ఉన్నాయని రివ్యూలు వస్తున్నాయి.
శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ పరకాయ ప్రవేశం చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. రణబీర్ లుక్ చూస్తుంటే ఆయనలో ఒక పక్క దైవత్వం, మరోపక్క ధైర్యం ప్రశాంతత ఉట్టిపడుతున్నాయని ప్రశంసలు అందుతున్నాయి. రణబీర్ కపూర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ పాత్రను పోషించడం తనకు లభించిన గొప్ప అవకాశమని, తన కెరీర్లోనే ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ దీని సంగీతం. ఆస్కార్ విజేత AR రెహమాన్, హాలీవుడ్ లెజెండరీ కంపోజర్ హాన్జ్ జిమ్మర్ కలిసి ఈ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని (BGM) అందిస్తున్నారు. టీజర్లోని మ్యూజిక్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉందని, సన్నివేశాలలోని గాంభీర్యాన్ని ఈ సంగీతం మరో స్థాయికి తీసుకెళ్లిందని విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ రమేష్ బాలా వంటి వారు ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో సీతగా సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రామాయణ గాథను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
పార్ట్ 1 2026 దీపావళికి విడుదల కానుంది. అదే విధంగా.. పార్ట్ 2 2027 దీపావళికి విడుదల చేయనున్నారు. మొత్తానికి, ‘రామాయణ’ టీజర్ భారతీయ సినిమా సత్తాను ప్రపంచ వేదికపై చాటిచెప్పేలా ఉందని రివ్యూలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం ప్రస్తుత తరం కోసమే కాకుండా, రాబోయే తరాలకు కూడా గుర్తుండిపోయేలా ఈ చిత్రాన్ని మలిచారని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.