Hyderabad: మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో ఏం జరగబోతోంది? ఆమె వ్యవహారంపై పార్టీ హైకమాండ్తో నేతల మంతనాలు ఎంతవరకు వచ్చాయి? రోజంతా సమావేశాలు జరిగినా నిర్ణయం పెండింగ్లో పడిందా? ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న మంత్రి కొండా, ఎయిర్పోర్టులో మాటల వెనుక అర్థం ఏంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ అంశంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ నేతలు ఆమె విషయంపై పార్టీ హైకమాండ్తో చర్చించారు. ఇరువైపు వర్గాల వాదనలు విన్న పార్టీ పెద్దలు, నిర్ణయాన్ని మాత్రం పెండింగ్లో పెట్టారు. ఒకానొక దశలో కొండా సురేఖ పార్టీకి రాజీనామా చేయడం ఖాయమని భావించారు. అప్పటికే ఆమె ఢిల్లీకి వెళ్లి, పార్టీ పెద్దలతో తన వెర్షన్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మీడియాతో ఆమె మాట్లాడడంతో వేటు ఖాయమని అనుకున్నారు. రాత్రి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు చేరుకున్నారు మంత్రి కొండా సురేఖ. రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిశానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో తనపై జరుగుతున్న పరిణామాలను వివరించానని వెల్లడించారు. తాను చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకున్న హైకమాండ్, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు వివరించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి వస్తున్న సంకేతాల నేపథ్యంలో కొండాసురేఖపై తదుపరి చర్యకు తీసుకోవచ్చని అంటున్నారు. ఆమెని మంత్రివర్గం నుంచి తొలగించాలంటే తొలుత ముఖ్యమంత్రి, ఆ తర్వాత గవర్నర్ను అనుమతి కోరాల్సి వుందన్నారట. దీన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారట. చివరకు కొండా సురేఖ.. అధ్యక్షుడు ఖర్గేను కలిసినప్పటికీ ఫలితం లేకపోయిందని సమాచారం.
ఇటీవల సర్వేలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఊపు వస్తున్న నేపథ్యంలో నేతలను దూరం చేసుకునే కంటే, ఈ విషయాన్ని కొన్నాళ్లు పక్కనబెట్టాలని ఆలోచన చేసినట్టు ఢిల్లీ సమాచారం. త్వరలో చేపట్టబోయే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై హైకమాండ్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ప్రస్తుతానికి కొండా వ్యవహారం కొన్నాళ్లు పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. ఒకవేళ హైకమాండ్ తీవ్రంగా మందలించినట్టు ఉంటే, హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆమె ఘాటుగానే రియాక్ట్ అయ్యేవారు. అలాంటిదేమీ జరగలేదని తెలుస్తోంది.
అందుకే రాత్రి మీడియా ముందు చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు కాకపోయినా, కొన్నాళ్లు తర్వాతైనా కొండా సురేఖపై వేటు ఖాయమన్న ప్రచారం లేకపోలేదు. పార్టీలో మంత్రులు, నేతలపై ఆ రాజకీయ పార్టీ నేరుగా చర్యలు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువ. వారి ఆలోచనకు అనుగుణంగా పావులు కదుపుతారు. రానున్న రోజుల్లో కొండా సురేఖ విషయంలో అదే జరుగుతుందని కొందరు నేతలు ఆఫ్ ద రికార్డులో చెబుతున్నారు.