Shruti Haasan:సెలబ్రిటీ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శృతిహాసన్ (Shruti Haasan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సింగర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె.. తెలుగులో ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ సరైన అవకాశాలు లేక వచ్చిన అవకాశాలను ఆమె సద్వినియోగం చేసుకోలేక ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది. అయితే సరిగ్గా ఆమె కెరియర్ ముగిసిపోయింది అనే కామెంట్లు వస్తున్న సమయంలో ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో గట్టి కం బ్యాక్ ఇచ్చింది శృతిహాసన్. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈమె తాజాగా హైకోర్టును ఆశ్రయించింది.
గత కొంతకాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ తో పాటు కొంతమంది సెలబ్రిటీలు వ్యక్తిత్వ హక్కులు, ప్రచార హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. తమ అనుమతి లేకుండా ఏఐ సాంకేతికతో రూపొందించిన కంటెంట్ , మార్ఫింగ్ చిత్రాలు, నకిలీ ప్రకటనలు, వీడియోలతో పాటు తమ పేరు , ఫోటోలను ఉపయోగించి.. అనధికారికంగా వస్తువుల విక్రయాలు చేస్తున్నారు. వీటన్నింటినీ తక్షణమే నిలిపివేయాలని సెలబ్రిటీలు పిటిషన్ దాఖలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే విషయంపై శృతిహాసన్ కూడా ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది..
ALSO READ:ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!
పలు భారతీయ, విదేశీ సంస్థలు ఈ లిస్ట్ లో ఉండడం గమనార్హం . అంతేకాదు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లతో పాటు గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులను కూడా ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చారు. ప్రతివాదుల్లో ఒకరైన ఓ క్రాఫ్ట్ వర్క్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ వేదికలో శృతిహాసన్ పేరు, ఫోటోలతో కూడిన పోస్టర్లను ఆమె అనుమతి లేకుండానే విక్రయిస్తున్నట్లు పిటిషన్ లో ఆరోపించారు. అలాగే పింట్ రెస్ట్, మెటా, గూగుల్, ఎక్స్ వంటి డిజిటల్ వేదికల్లో కూడా ఇతర నటులతో తనను అనుచితంగా అనుసంధానించే ఏఐ వీడియోలు , అసభ్యకరమైన డీప్ ఫేక్ చిత్రాలు కూడా ప్రసారం చేస్తున్నారని, ఇవన్నీ తన ప్రతిష్టకు నష్టం కలిగిస్తున్నాయి అంటూ ఆమె ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది..
ఇకపై ఎవరూ కూడా తన పేరును, ఫోటోలను,వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా వాణిజ్య పరంగా వినియోగించకుండా శాశ్వత పరిష్కారం చూపాలి అంటూ ఆమె తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. అంతేకాదు జరిగిన నష్టానికి తగిన నష్టపరిహారం చెల్లించాలని కూడా వారు కోర్టును విజ్ఞప్తి చేశారు. మరి దీనిపై ముంబై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.
ఇటీవలే డెకాయిట్ సినిమా నుండి తప్పుకొని గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేసుకున్న ఈమె సలార్ 2 చిత్రంలో నటించాల్సి ఉంది. వీటితోపాటు దుల్కర్ సల్మాన్ తో కలిసి ఆకాశంలో ఒక తార అనే చిత్రంలో నటిస్తున్న ఈమె.. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ట్రైన్ లో కూడా నటిస్తోంది. అంతేకాదు మార్క్ రోవ్లీకి జోడిగా ది ఐ అనే హాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా మారిపోయింది శృతిహాసన్.