కుక్కను నిలబెట్టినా గెలుస్తాం.. పిల్లిని నిలబెట్టినా గెలుస్తాం..! అని ఇకపై బీజేపీ జీవితంలో కూడా ఆ మాటనేందుకు సాహసించదు! ఈ మాటలన్నది పీకే. అదే బీహార్ బంకీపూర్ నుంచి గెలిచిన జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్. ఇది బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇలాఖ. అక్కడ తిరుగులేని పార్టీగా బీజేపీని పెంచి పోషించి…కంచుకోటలా ఉన్న ప్రాంతం. అక్కడ తన జెండా ఎగరవేశాడు ఉప ఎన్నికలో పీకే. గెలిచిన తరువాత ఈ మాటలన్నాడు అతను.
ఉత్తరాది రాష్ట్రాల్లో మోడీ హవా అంత ఉందని, మోడీ ముఖం చూసి ఓట్లేస్తారని, బీజేపీ గెలుపు అంటేనే దేశం కోసం, ధర్మం కోసం.. అనే నినాదం, విధానం ప్రజల్లో బాగా బలంగా ఉందని బీజేపీ నమ్ముతూ వస్తోంది. అందుకే వారి ప్రవర్తనలో, మాటలు, ప్రసంగాల్లో ఈ అహంకారపు ధోరణి కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఇక చెక్ పడింది… అని బంకీపూర్ కేంద్రంగా బీజేపీ అహంకారపు దోరణులను, వారి నమ్మకాన్ని బద్దలు కొట్టినా అని చెప్పడం పీకే ఉద్దేశ్యం ఇక్కడ.
అంటే ఉత్తరాదిని బలంగా నమ్ముకుని రాజకీయాలు నడుపుతున్న బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయని, ఇక తిరోగమనం స్టార్ట్ అయ్యిందని చెప్పడం కూడా దీని వెనుక ఉన్న అర్థం. పరమార్థం. ఇప్పుడు దీన్ని మన తెలంగాణకు అన్వయిచుకుందాం. సేమ్.. అచ్చం ఇట్లనే అంటున్నాడు కేటీఆర్ కూడా. మూడు సార్లు ఒక్కరికే టికెట్లిచ్చారు. పదేళ్లు పాలించిన ఎమ్మెల్యేల అరాచకాలపై జనాలు తిరబడినా వినలేదు. కేసీఆర్ ముఖం చూసి గెలిపిస్తారనే ధీమా, ఓటర్లను తక్కువ వేసిన వారి అహంకారానికి మొన్న మూల్యం చెల్లించారు. ఉల్టా వారి మీదనే అలిగి ఫామ్హౌజ్లో పడుకున్నాడు కేసీఆర్.
అయినా బుద్ది మారలేదు. తీరు మార్చుకోలేదు. ఇప్పటికీ.. మొన్నటికి మొన్న కూడా కేటీఆర్ అంటున్నాడు. ఎవరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలో కేసీఆర్కు తెలుసు. ఓట్లేసి గెలిపించడమే మీ బాధ్యత.. అని ఉపదేశమిచ్చాడు. అంతకు ముందు నుంచి కూడా బీఆరెస్లో ఈ నానుడి ఉంది. కేసీఆర్ .. చెప్పును నిలబెట్టినా గెలిచి తీరుతుంది. అక్కడ కేసీఆర్ ముఖం చూస్తారు. క్యాండిడేట్ను చూడరు అని.
అది గతంలో నడిచిందేమో. ఉద్యమ సారథిగా, తెలంగాణ కోసం ముందుండి కొట్లాడిన నేతగా.. తెలంగాణ మీద కనీస స్పృహ కలిగిన నాయకుడిగా జనం ఆ అవకాశం ఇచ్చారు. అది ఉన్న అహంకారాన్ని వెయ్యింతలు చేసింది. అందుకే ఇప్పటికీ తల బిరుసు దిగడం లేదు. ఇంకా ఇంకా అవే మాటలంటున్నారు.
కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది నిజమే. ఆ వ్యతిరేకతే మమ్మల్ని గెలిపిస్తుందనే సమీకరణకు రావడం కూడా వారి దిగజారుడు రాజకీయాలకు ప్రతీకగానే చూడాలి. ఏం తప్పులు చేశాం.. వాటిని ఎలా సరిదిద్దుకుంటున్నాం..ఇంకా ప్రజలకు నమ్మకం పెరిగేలా ఏం చేద్దాం..? అనే ఆత్మపరిశీలన లేదు. తండ్రీకొడుకుల్లో.
కానీ ఇద్దరికి ఇద్దరు లెక్కలేసుకుంటున్నారు విజయ అవకాశాలపై. మళ్లీ వారినే వెంటబెట్టుకొని తిరుగుతున్నాడు కేటీఆర్. ఎవరైతే వద్దు అని తిరస్కరించి ఇంటికి పంపారో…ఆ మాజీలు కేటీఆర్ వెంట ఉంటున్నారు.
అంటే ఈసారీ కుక్కలకే టికెట్లిస్తారా? అదే కేసీఆర్, కేటీఆర్ భాషలో చెప్పాలంటే ఇలాగే చెప్పాలన్నమాట. మరి కుక్కలకే ఇస్తే.. మీ సంగతి కూడా బంకీపూరే అవుతుంది.. బతుకు బస్టాండ్ అవుతుంది.. అనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయినా మారకపోతే మీ ఖర్మ.. అంటున్నారు బీఆరెస్ అభిమానులు.
ఇక్కడో విషయం చెప్పుకోవాలి. మేమే ఆల్టర్నేట్ అనుకుంటున్న బీఆరెస్…. మధ్యేమార్గంగా జనాలు ఓసారి బీజేపీకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచన చేస్తే.. ? మీ రెండు పార్టీల తీరు చూసి జనాల్లో ఈ చర్చ కూడా ప్రారంభమైనా ఆశ్చర్యం లేదు. ఇది దేశ రాజకీయ ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండానే.. ఇక్కడి తెలంగాణ రాజకీయాల పరిణామాల ప్రభావంగా జరిగే చర్యగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే..