Railways Fine on IRCTC Caterers: రైళ్లలో ప్రయాణికులకు అందించే ఫుడ్ క్వాలిటీపై వచ్చిన కంప్లైంట్స్ ను రైల్వే సీరియస్గా తీసుకుంటోంది. గత మూడు సంవత్సరాల్లో లో క్వాలిటీ ఫుడ్, నీట్ నెస్ లేని ప్యాంట్రీ కార్లు, ఇతర క్యాటరింగ్ సర్వీసులకు సంబంధించిన ఫిర్యాదులపై విచారణ జరిపి, సంబంధిత సర్వీస్ కంపెనీల మీద మొత్తం రూ. 5.13 కోట్ల జరిమానా విధించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
రాజ్యసభలో తాజాగా అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ మంత్రి వైష్ణవ్ ఈ వివరాలు వెల్లడించారు. భారతీయ రైల్వే ప్రతి ఏడాది దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులకు ఫుడ్ సర్వీసులు అందిస్తుందన్నారు. సగటున ఏడాదికి దాదాపు 58 కోట్ల ఫుడ్ ప్లేట్స్ సరఫరా చేస్తోంది. వాటిలో వచ్చిన కంప్లైంట్స్ శాతం కేవలం 0.0008 శాతం మాత్రమేనన్నారు. అయినప్పటికీ, ప్రతి ఫిర్యాదును పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
గత మూడేళ్లలో అందిన ఫిర్యాదులపై విచారణ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన క్యాటరింగ్ సర్వీస్ సంస్థలపై రూ. 5.13 కోట్ల జరిమానా విధించినట్లు మంత్రి తెలిపారు. ప్రయాణికులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. రైల్వేలో ఫుడ్ క్వాలిటీని మరింత మెరుగుపరచేందుకు ఇప్పటికే కీలక చర్యలు చేపట్టినట్లు వైష్ణవ్ వివరించారు. ముఖ్యంగా, గుర్తింపు పొందిన బేస్ కిచెన్లలో మాత్రమే ఆహారం తయారు చేసి రైళ్లకు పంపించే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో లేటెస్ట్ బేస్ కిచెన్లను ఏర్పాటు చేసి, అక్కడ తయారయ్యే ఆహారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీంతో పరిశుభ్రత, నాణ్యతపై నిరంతర నిఘా ఉంటుందన్నారు.
అంతేకాకుండా, రైళ్లలో ఆహార విక్రయాలను మరింత పారదర్శకంగా మార్చేందుకు డిజిటల్ బిల్లింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్యాంట్రీ కార్లలో పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలను ఏర్పాటు చేయడం ద్వారా బిల్లింగ్ సులభతరం చేస్తున్నామని చెప్పారు. అలాగే యూపీఐ, క్యూఆర్ కోడ్లు, స్వైప్ మెషీన్ల ద్వారా క్యాష్ లెస్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. దీంతో ప్రయాణికులు సులభంగా చెల్లింపులు చేయడంతో పాటు బిల్లులు కూడా పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ అంశాన్ని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు చంద్రకాంత్ హండోరే ప్రస్తావించారు. ప్రీమియం, ఎక్స్ప్రెస్ రైళ్లలో నాసిరకం ఆహారం, అపరిశుభ్రమైన ప్యాంట్రీ కార్లు, క్యాటరింగ్ సేవల్లో లోపాలపై గత మూడేళ్లలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో వివరాలు ఇవ్వాలని ఆయన కోరారు. నాసిరకం ఆహారం అందించినా, నిర్ణయించిన పరిమాణం కంటే తక్కువ ఆహారం వడ్డించినా సంబంధిత ఐఆర్సిటీసీ లైసెన్సుదారులపై తీసుకున్న చర్యల వివరాలను కూడా అడిగారు. దీనికి సమాధానంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నామని, తప్పు చేసిన వారిపై జరిమానాలు విధించడం సహా కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Read Also: విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!