Star Actors Angry On Triptii Dimri : ముంబైలో జరిగిన ఓ’రోమియో సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అనుకోని వివాదంతో వార్తల్లో నిలిచింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు నానా పాటేకర్ ముందుగానే హాజరయ్యారు. అయితే హీరో షాహిద్ కపూర్ మరియు హీరోయిన్ త్రిప్తి దిమ్రి ఆలస్యంగా రావడంతో పరిస్థితి మారిపోయింది.
వివరాల ప్రకారం నానా పాటేకర్ మధ్యాహ్నం 12 గంటలకే ఈవెంట్ వేదికకు చేరుకున్నారు. కానీ షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రి మాత్రం దగ్గరలోని ఒక థియేటర్లో సినిమా పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ఆలస్యం కావడంతో వారు ట్రైలర్ లాంచ్కు దాదాపు గంటన్నర ఆలస్యంగా వచ్చారు. ఈలోగా నానా పాటేకర్ చాలా సేపు ఎదురు చూడాల్సి వచ్చింది.
దాదాపు 1 గంట 30 నిమిషాలు వేచి చూసిన తర్వాత నానా పాటేకర్ అసహనం వ్యక్తం చేస్తూ ట్రైలర్ విడుదలకు ముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. చాలా మంది నెటిజన్లు నానా పాటేకర్ నిర్ణయానికి మద్దతు తెలిపారు. “సీనియర్ నటులకు గౌరవం ఇవ్వాలి”, “సమయపాలన ఉండాలి” అంటూ కామెంట్లు చేశారు.
కొంతమంది “ఎంత పెద్ద స్టార్ అయినా సరే, సమయాన్ని పాటించాలి. ఒక సీనియర్ నటుడిని గంటన్నర వేచిచూడమంటే అది ఆయన్ని కించపరిచినట్టే” అని అభిప్రాయపడ్డారు. నానా పాటేకర్ క్రమశిక్షణను పాటించే వ్యక్తి అని, అందుకే ఆయన అలా వెళ్లిపోయారని అభిమానులు పేర్కొన్నారు.
ఈ ఈవెంట్లో నానా పాటేకర్ తనకు అలవాటైన కుర్తా–పాజామా దుస్తుల్లో కనిపించి, వెళ్లే ముందు మీడియాకు ఫోటోలు కూడా ఇచ్చారు. ఈ విషయంపై దర్శకుడు విశాల్ భరద్వాజ్ స్పందిస్తూ, “నానా ఉంటే బాగుండేది. కానీ ఒక గంట పాటు వేచిచూడాల్సి రావడంతో ఆయన వెళ్లిపోయారు. అది ఆయన స్వభావం” అని అన్నారు.
ఓ’రోమియో సినిమా ఫిబ్రవరి 13, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రి, నానా పాటేకర్తో పాటు పలువురు ప్రముఖ నటులు నటిస్తున్నారు.
ఇక తృప్తి దిమ్రి అనిమల్ సినిమా తరువాత ఎంతటి పేరు తెచ్చుకుందో అందరికీ తెలిసిందే విషయమే. హిందీలోనే కాకుండా తెలుగులో కూడా ఈమె టాప్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా.. దర్శకత్వంలో రానున్న ప్రభాస్ సినిమా స్పిరిట్ లో కూడా హీరోయిన్గా నటిస్తోంది.
ALSO READ: Teena Sravya: సమ్మక్క, సారక్క జాతర వివాదంపై స్పందించిన టాలీవుడ్ నటి టీనా శ్రావ్య