AP Investments: స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ద్వయం గ్లోబల్ టెక్ దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహిస్తూ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతికతను ఆహ్వానిస్తున్నారు. ఏఐ (AI), డేటా సెంటర్లు, పర్యాటకం, పారిశ్రామిక రంగాల్లో ఏపీని గ్లోబల్ హబ్గా మార్చేలా కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
ఏఐ రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పలు కీలక ప్రతిపాదనలు చేశారు. కాలిబో ఏఐ అకాడెమీ (Calibo AI) సంస్థ వ్యవస్థాపకులు రాజ్ వట్టికూటితో సీఎం సమావేశమయ్యారు. అమరావతిలో ఇప్పటికే ప్రారంభమైన ఏఐ అకాడెమీని ఇతర విశ్వవిద్యాలయాలకు విస్తరించాలని, విశాఖపట్నంలోని ఐటీ సెజ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని సీఎం కోరారు.
మెటా వైస్ ప్రెసిడెంట్ కెల్విన్ మార్టిన్తో భేటీ అయిన మంత్రి లోకేష్, విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు వాట్సాప్ ఆధారిత డిజిటల్ గవర్నెన్స్పై సహకరించాలని కోరారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH)తో భాగస్వామ్యంపై కూడా చర్చించారు. సుమారు $29 బిలియన్ల విలువ కలిగిన స్కేల్ ఏఐ (Scale AI) సంస్థతో విశాఖలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు ఏఐ భద్రత (AI Safety) ల్యాబ్ ఏర్పాటుపై లోకేష్ చర్చలు జరిపారు.
రాష్ట్ర పర్యాటక రంగానికి ‘పారిశ్రామిక హోదా’ కల్పించామని పేర్కొంటూ సీఎం చంద్రబాబు తమారా లీజర్ (Tamara Leisure) సీఈఓ సృష్టి శిబులాల్తో చర్చలు జరిపారు. పోలవరం నుండి భద్రాచలం వరకు గోదావరి తీరంలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి, అరకు, లంబసింగి వంటి ప్రాంతాల్లో ఎకో-టూరిజం పార్కులు, విశాఖలో హోమ్-స్టే ప్రాజెక్టులపై చర్చించారు. “ఏపీ ఇప్పుడు అన్లాక్ అయింది” అని వివరిస్తూ పెట్టుబడిదారులను సీఎం ఆహ్వానించారు.
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. విశాఖలో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని, పాఠశాల స్థాయి నుండే ఫైనాన్షియల్ లిటరసీ (ఆర్థిక అవగాహన) కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. జెఎస్డబ్ల్యూ ఎండి పార్థ్ జిందాల్తో భేటీలో కడప స్టీల్ ప్లాంట్ పనుల వేగవంతంపై చర్చించారు. రాష్ట్రంలో కొత్తగా పెయింట్స్ తయారీ యూనిట్, ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీ లైన్, గండికోట వంటి వారసత్వ ప్రదేశాల దత్తతపై లోకేష్ ప్రతిపాదించారు.
Read Also: YS Jagan: మాట తప్పను.. మడమ తిప్పను.. మళ్లీ ప్రజల వద్దకే వెళ్తాను.. వైఎస్ జగన్