Vijay Mother: తల్లి ప్రేమ వెలకట్టలేనిది. తన బిడ్డల ఎదుగుదల కోసం ప్రతి తల్లి ఎన్నో త్యాగాలు చేస్తుంది. అందుకే సెలబ్రిటీలైనా, సామాన్యులైనా తమ తల్లిపై ఉన్న ప్రేమను రకరకాలుగా చాటుకుంటారు. మాతృ దినోత్సవం (Mother’s Day 2026) సందర్భంగా కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ తన తల్లి శోభా చంద్రశేఖర్ కోసం చేసిన ఒక గొప్ప కార్యం ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది.
Read also-Kissik Talks: మరకతమణి సీక్వెల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన సంజన!
విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ షిరిడీ సాయిబాబాకి పరమ భక్తురాలు. ఆమెకు తరచూ షిరిడీ వెళ్లి బాబాని దర్శించుకోవాలని ఉండేది. అయితే వయసు పెరగడం వల్ల, ప్రయాణాలు చేయడం ఆమెకు భారంగా మారింది. తన తల్లి ఇబ్బందిని గమనించిన విజయ్, ఆమె కోసం చెన్నైలోనే ఒక సాయిబాబా ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు.
చెన్నైలోని కొరటూరు ప్రాంతంలో ఉన్న తన సొంత స్థలంలో విజయ్ ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. సుమారు 5.5 గ్రౌండ్ల విస్తీర్ణంలో, అత్యంత ఖరీదైన మార్బుల్స్తో ఈ మందిరాన్ని తీర్చిదిద్దారు. 2024 ఫిబ్రవరిలో ఈ ఆలయ కుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఆ సమయంలో విజయ్ తన తల్లితో కలిసి పూజల్లో పాల్గొన్న ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాను ఊపేసాయి.
విజయ్ తన సేవా కార్యక్రమాలను కానీ, ఇలాంటి వ్యక్తిగత విషయాలను కానీ ఎప్పుడూ పెద్దగా ప్రచారం చేసుకోరు. ఈ ఆలయ నిర్మాణం కూడా ఎవరికీ తెలియకుండా చాలా నిశ్శబ్దంగా పూర్తి చేశారు. తన తల్లికి ఇష్టమైన దైవం ఆమె చెంతనే ఉండాలని, ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రశాంతంగా పూజలు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లో (TVK పార్టీ) బిజీగా ఉన్నారు. ఒకవైపు తన కెరీర్ను విజయవంతంగా కొనసాగిస్తూనే, మరోవైపు కుటుంబ బాధ్యతలను, ముఖ్యంగా తల్లి కోరికలను తీర్చడంలో ఆయన చూపిస్తున్న శ్రద్ధ పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. “రియల్ లైఫ్ హీరో” అంటూ నెటిజన్లు విజయ్ని కొనియాడుతున్నారు. ఈ మాతృ దినోత్సవం వేళ, విజయ్ తన తల్లికి అందించిన ఈ ‘ఆధ్యాత్మిక కానుక’ అందరికీ స్ఫూర్తినిస్తోంది. ఇదే రోజున విజయ్ తమిళనాడు ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండటం విశేషం.