Varalakshmi Vratham Reels Controversy:ఈరోజుల్లో దేవుళ్ళని కూడా లైకులు తెచ్చే టూల్స్ గా వాడేసుకుంటున్నారు మన సో కాల్డ్ నెటిజన్లు.వ్యూస్ తెచ్చుకునేందుకు కాదేదీ అనర్హం అంటూ ఎంతకైనా తెగించేస్తున్నారు.
ఇక ఈ క్రమంలోనే తాజాగా ఎంతో పవిత్రంగా చేయాల్సిన వరలక్ష్మి వ్రతాన్ని కూడా వ్యూస్ ని తెచ్చిపెట్టే వైరల్ కంటెంట్ గా భావించి ఎలా పడితే అలా ,ఇష్టమొచ్చినట్టుగా చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.దీంతో ఇదే విషయంపై ఘాటుగా స్పందించింది అమ్మోరు సినిమాలో పాప గా చేసిన సునయన.
ఇందులో భాగంగానే తన యూట్యూబ్ ఛానల్ “సునైనా ది ఒరిజినల్” లో “పిచ్చికి పరాకాష్ట.. ఇవి ఏ రకంగా వ్రతాలు ?”రకరకాలుగా వీడియోలు చేసే వారందరిని ఏకిపారేసింది.
వరలక్ష్మీ వ్రతం అంటే మన తాతముత్తాల నుండి వస్తున్న ఒక గొప్ప ఆచారం ,దాన్ని భక్తి నిష్టలతో చేసుకోవాలి.లక్ష్మీ దేవి ముందు పద్దతిగా కూర్చుని చేయాల్సిన గొప్ప పండగ. కానీ ఇప్పటి సోషల్ మీడియా యుగంలో కొందరు చేస్తున్న పనులు చూస్తుంటే నిజంగానే దిమ్మతిరిగిపోతుందని ,అమ్మవారి ముందే కూర్చుని భక్తి పాటలకు బదులు వెకిలి సినిమాలు లేదా ట్రెండింగ్ డాన్స్ పాటలకు రీల్స్ చేయడం ఏంటో అర్థం కావడం లేదని మండిపడింది.
పూజా విధానంలో శ్రద్ధ పక్కన పెట్టి కేవలం వ్యూస్, లైక్స్, షేర్ల కోసమే కెమెరాల ముందు రకరకాల షోలు చేయడం ఇపుడు ప్యాషన్ అయిందని, ట్రెడిషనల్ గా బట్టలు వేసుకోవాల్సిన వారు ఎలా పడితే అలా ట్రెండ్ అంటూ పీలికలు వేసుకుని దేవుడి పటాల ముందు డాన్సులు వేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఈరోజుల్లో చాలా కామన్ అయిందని వాపోయింది.
ఇక కోట్ల కొద్దీ లైకులు,మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయనే ఒకే ఒక్క కారణంతో అమ్మవారిని, పూజా సంప్రదాయాలను ఇలా ఎగతాళి చేయడం ఏ రకంగా కరెక్ట్ అని తన వీడియోలో మండిపడింది సునైనా.
“పసుపు రాసుకోవడానికి నామోషీ పడే ఈ తరం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం ఏ స్థాయికైనా దిగజారడం పిచ్చికి పరాకాష్ట కాక మరేమిటి?” అంటూ ఏకిపారేసింది.
ఇక మన పెద్దవాళ్ళు ఆరోజుల్లో పండుగ వస్తే ఇల్లంతా శుభ్రం చేసుకుని, దేవుడికి నైవేద్యాలు సమర్పించి, పసుపు-కుంకుమలు ఇచ్చుకుంటూ పద్ధతిగా వేడుకలు చేసుకునేవారని చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత, భక్తి అనేది మనసులో కాకుండా కెమెరా లెన్స్ ముందు మాత్రమే కనిపిస్తోందని ,పక్కన ఉన్న పొరుగువారితో మాట్లాడే ఓపిక లేని చాలామందికి, సోషల్ మీడియాలో గంటల తరబడి రీల్స్ చేయడానికి మాత్రం బోలెడంత సమయం దొరుకుతోందని తూర్పారబట్టింది.
ఈ పద్ధతులు ఇలాగే కొనసాగితే రాబోయే తరాలకు మన సాంప్రదాయాల పట్ల ఎలాంటి సందేశం ఇస్తున్నామనేది ఇక్కడ ముఖ్యమని “మా మనసే మాకు సాక్షి” అని చెప్పుకుంటూనే, దేవుడి పటాల ముందు వెకిలి చేష్టలు చేయడం మన బాధ్యత లేని తనాన్ని చూపిస్తుందని తెలిపింది.ఏది ఏమైనా సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం ఇలా దేవుళ్ళని టూల్స్ గా వాడుకునేంతలా ఇప్పటి తరం దిగజారిపోవడం నిజంగా బాధాకరం