Nepal Floods| నేపాల్లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటికే తీవ్ర నష్టం జరిగింది. ఇప్పుడు నేపాల్ – టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పడిన కొత్త సరస్సు మరో వరద ముప్పును పెంచింది. చైనా అధికారులు ఈ సరస్సు ఆనకట్ట 3 రోజుల్లో తెగిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. సరస్సులో నీటి పరిమాణం పెరిగితే దిగువ ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరే ప్రమాదం ఉంది.
టిబెట్ భూభాగంలో ఉన్న చోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్పో నదులు కలిసే ప్రాంతంలో ఒక కొత్త సరస్సు ఏర్పడింది. చైనా నీటి వనరుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. గురువారం ఉదయానికి సరస్సులో దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఉంది. సరస్సు ఇప్పటికే పొంగిపొర్లుతున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు సరస్సులోకి చేరవచ్చని అంచనా వేశారు. దీంతో సహజంగా ఏర్పడిన అడ్డంకిపై ఒత్తిడి పెరిగి సరస్సు డ్యామ్ గోడ విరిగిపోయే ప్రమాదం పెరుగుతోంది.
చైనా అధికారులు సరస్సు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. డ్యామ్ గోడ విరిగితే వరద నీరు ఎటువైపు ప్రవహిస్తుందో తెలుసుకోవడానికి అధికారులు వరద మోడల్స్ రూపొందిస్తున్నారు. ఈ అంచనాలు ఎమర్జెన్సీ సహాయక చర్యలను ముందుగానే సిద్ధం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
భారీ వర్షాల కారణంగా నేపాల్లోని మూడు జిల్లాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తు రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక వసతులను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో మారుమూల పర్వత ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవడం కష్టంగా మారింది.
నేపాల్లో అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 400కి చేరింది. వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో సుమారు 260 మంది విదేశీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిరంతర వర్షాలు, అస్థిరమైన కొండ ప్రాంతాలు సహాయక చర్యలకు మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నాయి. కొత్త సరస్సు తెగిపోయే అవకాశం ఉండటంతో అధికారులు మరో వరద పరిస్థితికి సిద్ధమవుతున్నారు.
టిబెట్లో కూడా చైనా అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. నేపాల్ వైపు నుంచి వచ్చిన కొండచరియలు టిబెట్లోని గ్యిరోంగ్ పోర్ట్ ప్రాంతాన్ని ప్రభావితం చేశాయి. చైనా అధికారులు అత్యవసర సిబ్బంది, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, ఇంజినీరింగ్ బృందాలను రంగంలోకి దించారు. టెలికాం సిబ్బంది, సహాయక సంస్థలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. విమానాలు, రక్షణ పరికరాలు, అవసరమైన సామగ్రిని ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలు, కొండచరియల ముప్పు మధ్య బృందాలు క్లిష్టమైన ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి.
టిబెట్ ప్రభుత్వం అంటే సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ తమ భూభాగంలో చైనా అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్టులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. టిబెట్ పీఠభూమిలోని కొన్ని చైనా ప్రాజెక్టులు పర్యావరణానికి హాని చేస్తున్నాయని టిబెట్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ఇలాంటి పర్యావరణ నష్టం హిమాలయ ప్రాంతంలో విపత్తుల ముప్పును పెంచవచ్చని హెచ్చరించింది. డ్యామ్లు, జలాశయాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, రైల్వే నిర్మాణాలను పరిపాలన ప్రస్తావించింది. వీటిలో చాలా ప్రాజెక్టులు.. హరిత ఇంధనం, మౌలిక వసతుల అభివృద్ధి కోసం చేస్తున్నట్లు చైనా ప్రచారం చేస్తోంది.
అయితే, వీటి వల్ల పర్యావరణంపై తీవ్రమైన ప్రభావం ఉండవచ్చని టిబెటన్ పరిపాలన పేర్కొంది.
టిబెట్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ప్రపంచ సగటు కంటే రెండింతల వేగంతో పెరుగుతున్నాయని కూడా తెలిపింది. హిమాలయ పర్యావరణాన్ని కాపాడేందుకు మరింత శ్రద్ధ అవసరమని కోరింది.
ఇటీవలి వరదలు నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో తీవ్ర ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించాయి. రెండు ప్రాంతాల్లో 1,500 మందికి పైగా మరణించినట్లు, గాయపడినట్లు లేదా గల్లంతైనట్లు టిబెట్ ప్రభుత్వం తెలిపింది. అయితే, అధికారిక సంఖ్యలు ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు.
Also Read: పిసినారిగా ఉండాల్సిన అవసరం లేదు.. జీవితాన్ని ఆస్వాదిస్తూ డబ్బు ఆదా చేసే టిప్స్
చైనాలో వరదలు, కొండచరియలకు సంబంధించిన ఆన్లైన్ సమాచారంపై ఆంక్షలు ఉన్నాయని పలు నివేదికలు తెలిపాయి. టిబెట్లో ప్రజలు చిత్రీకరించిన కొన్ని వీడియోలు చైనా సోషల్ మీడియా నుంచి తొలగించబడ్డాయని వార్తలు వచ్చాయి. గ్యిరోంగ్ కౌంటీలో కొండచరియలు సరిహద్దు ప్రాంతాన్ని ముంచెత్తుతున్న వీడియో కూడా అందులో ఉంది.
Also Read: బాబోయ్.. ఇంటర్న్షిప్ చేస్తే నెలకు రూ.30 లక్షలు.. ఆ స్కిల్స్ ఉంటేనే
అత్యవసర సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఆయన అక్కడికి వెళ్లినట్లు అధికారిక మీడియా తెలిపింది. చైనా విదేశాంగ శాఖ ప్రకారం.. నేపాల్లో దాదాపు 100 మంది చైనా పౌరులు గల్లంతయ్యారు.