Varanasi:అభిమానుల కల నెరవేరుతోంది.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu), గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli )చేతులు కలిపితే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. 15 ఏళ్ల నిరీక్షణ తర్వాత ‘వారణాసి’తో ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్తోంది. పురాణాలు, అడ్వెంచర్, టైమ్ ట్రావెల్ కలబోసిన ఈ కథ విన్నప్పుడు మహేష్ బాబు సైతం ఒక్క క్షణం భయపడ్డారంటే, జక్కన్న విజన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా మహేష్ ఓ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలను పంచుకున్నాడు ..వివరాలలోకి వెళితే..
మహేష్ బాబు, రాజమౌళి కలిసి సినిమా చేయాలని దాదాపు 15 ఏళ్ల క్రితమే అనుకున్నారు. కానీ, సరైన కథ కుదరక అది వాయిదా పడుతూ వచ్చింది. ‘RRR’ తర్వాత సుమారు ఏడాది పాటు జక్కన్న టీమ్ ఈ స్క్రిప్ట్ కోసమే శ్రమించింది. తీరా కథ సిద్ధమయ్యాక మహేష్ను ఆఫీసుకి పిలిచి వినిపించగా, ఆయన ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారట. యాక్షన్, అడ్వెంచర్తో పాటు మన పురాణాలను, అత్యాధునిక ‘టైమ్ ట్రావెల్’ కాన్సెప్ట్ను జోడించి రాజమౌళి ఈ కథను అల్లారు. ఇలాంటి భిన్నమైన జానర్ను డీల్ చేయడం సవాలుతో కూడుకున్న పని అని భావించిన మహేష్, మొదట్లో హీరోగా చేయడానికి కాస్త భయపడ్డారు. అయితే రాజమౌళి ఇచ్చిన భరోసా, కథ వివరించిన విధానం ఆ భయాన్ని పోగొట్టినట్టు మహేష్ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.
ఈ సినిమాలో మహేష్ బాబు ‘రాముడి’ ఛాయలున్న పాత్రలో కనిపిస్తారని సమాచారం. రాముడికి ఉండాల్సిన ఆ హుందాతనం, ప్రత్యేకమైన శరీర భంగిమల కోసం మహేష్ నెలల తరబడి కష్టపడుతున్నారు. కేవలం రెండు షాట్ల కోసం ఆయన పరిగెత్తే విధానాన్ని మార్చుకోవడానికి జర్మనీ వెళ్లి ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకోవడం విశేషం. రాజమౌళి పర్ఫెక్షన్ కోసం యూరోపియన్ శిల్పాలను కూడా పరిశీలించి మహేష్ లుక్ను డిజైన్ చేశారు. బాహుబలి, RRR వంటి చిత్రాల కంటే ఇది పూర్తిగా భిన్నమైన ప్రపంచం అని, ఇందులో టైమ్ ట్రావెల్ ఎలిమెంట్ ప్రేక్షకులను సరికొత్త అనుభూతికి గురిచేస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ALSO READ:Jabardasth Actor: రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ నటుడు మృతి.. అసలేం జరిగిందంటే?
ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలకు ఉన్న క్రేజ్ ఒక ఎత్తు అయితే, రాజమౌళి బ్రాండ్ మరో ఎత్తు. వీరిద్దరి కలయిక కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ ఎదురుచూస్తున్నారు. ప్రియాంక చోప్రా తిరిగి ఇండియన్ స్క్రీన్ పైకి రావడం, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి నటుడు భయంకరమైన విలన్గా కనిపించనుండటంతో.. మొన్న జరిగిన మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్లో మహేష్ మాటలతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ను మరో మెట్టు ఎక్కించేందుకు సిద్ధమవుతున్న ఈ ‘వారణాసి’ ప్రయాణం 2027లో సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయనుంది.